డాక్టర్స్ డే : ప్రాణాలకు తెగించి కరోనా మహమ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్న డాక్టర్లకు సెల్యూట్ !!
ధన్వంతరి వారసులు, ధరణి లోన దేవుళ్ళు... వ్యాధులతో బాధపడే రోగుల బాధలు తీర్చడానికి కృషి చేసే కర్మ వీరులు డాక్టర్లు. అలాంటి డాక్టర్లందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరోనా మహమ్మారిపై దేశం సాగించిన పోరాటంలో ముందు వరుసలో నిలబడి పోరాడిన వైద్యులందరికీ సెల్యూట్ చేస్తూ వన్ ఇండియా అందిస్తున్న ప్రత్యేక కథనం.

వైద్యో నారాయణో హరి అన్న వాక్యానికి నిర్వచనంగా నిలుస్తున్న వైద్యులు
ఈరోజు జూలై 1 న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాల్సిన రోజు. గతంలో కంటే కరోనా మహమ్మారి భారత దేశం పై పంజా విసిరిన సమయంలో మహమ్మారి బారి నుండి దేశాన్ని కాపాడడానికి, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించటం కోసం వైద్యులు చేసిన కృషి గణనీయమైనది. ఎంతో మంది వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి గత ఏడాది నుండి అవిశ్రాంతంగా వైద్యసేవలు కొనసాగిస్తూ వైద్యో నారాయణో హరి అన్న పదానికి సరైన నిర్వచనం చెప్తున్నారు.

ఘనంగా డాక్టర్స్ డే .. వారి సేవలకు దేశం సెల్యూట్
భారతదేశం జూలై 1 న 'జాతీయ వైద్యుల దినోత్సవం' గా జరుపుకుంటుంది . వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మరియు రాజకీయ నాయకుడిగా పనిచేసిన దిగ్గజ మరియు అంతర్జాతీయ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ జ్ఞాపకార్థం ఈ రోజు జాతీయ వైద్యుల దినోత్సవం గా జరుపుకుంటారు. దీనిని ఏటా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా కరోనా మహమ్మారి పై పోరాటం లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యులు మరియు ఆరోగ్య నిపుణులందరికీ ఈ సంవత్సరం మరోసారి అంకితం చేయబడింది.

కరోనా కారణంగా వందల్లో నెలకొరిగిన వైద్యులు .. ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాలే త్యాగం చేసిన యోధులు
జూలై 1991 లో దేశంలో మొదటి జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఎంతో మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి నుండి ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో కరోనా సెకండ్ వేవ్ లో 798 మంది వైద్యులు మరణించారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. జూన్ 25 న ఐఎంఏ కోవిడ్ రిజిస్ట్రీ ప్రకారం, రాష్ట్రాల వారీగా వైద్యుల అమరవీరుల జాబితాలో, బీహార్లో గరిష్టంగా 115 మంది మరణించారు. ఢిల్లీలో 109, ఉత్తర ప్రదేశ్ 79, పశ్చిమ బెంగాల్ 62, రాజస్థాన్ 44, జార్ఖండ్ 39, మరియు ఆంధ్రప్రదేశ్ 40 మంది వైద్యులు మరణించారు .మహారాష్ట్రలో 23 మంది డాక్టర్ మరణాలు, కేరళలో 24 మంది మరణించారని ఐఎంఏ వెల్లడించింది. వారందరికీ నివాళులర్పించింది.

కరోనా పై యుద్ధంలో వీరోచిత పోరాటం చేస్తున్న వైద్యులకు పలువురి ప్రశంసలు
ఇక ఈ రోజు డాక్టర్స్ డే ను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు మరియు ప్రముఖులు కరోనా మహమ్మారిపై గతేడాది నుండి నిరంతరాయంగా పనిచేస్తున్న వైద్యులు మరియు ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తదితరులు అసమానతలతో సంబంధం లేకుండా మానవాళికి సేవ చేయడానికి వైద్యులు చేసిన వీరోచిత ప్రయత్నాలను ప్రశంసించారు. వారే నిస్వార్ధ దేవదూతలని కొనియాడారు.












Click it and Unblock the Notifications