ఉగ్రవాదులకు నిలయంగా ఆ యూనివర్సిటీ..? దర్యాప్తు సంస్థలు తేల్చింది ఇదే..
దేశ రాజధాని దిల్లీలో సోమవారం సాయంత్రం బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12మంది మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. భారీ పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక బృందాన్ని తాజాగా ఏర్పాటు చేసింది. అయితే ఈ బాంబు దాడికి సంబంధించి దర్యాప్తు అధికారులు తవ్వే కొద్దీ ఇందుకు సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దిల్లీ బాంబు దాడిలో నిందితులుగా ఉన్న ముగ్గురు డాక్టర్లు 'అల్ ఫలాహ్' యూనివర్సిటీకి చెందినవారుగా తేలింది. వీళ్లంతా జైషే-ఈ- మహమ్మద్ టెర్రర్ గ్రూప్ సభ్యులుగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయాలను మాత్రం యూనివర్సిటీ తోసిపుచ్చుతోంది.
హరియాణా- దిల్లీ సరిహద్దుకు 27 కిలోమీటర్ల దూరంలో ఫరీదాబాద్ లోని ధౌజ్ గ్రామంలో 'అల్ ఫలాహ్' యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇదో ప్రైవేట్ యూనివర్సిటీ. అధికారులు తాజాగా ఈ యూనివర్సిటీని తనిఖీ చేశారు. దాదాపు 52 మంది వైద్యులను విచారించారు. మరోవైపు దిల్లీ బాంబు పేలుడు ఘటనకు కారకులైన డాక్టర్ ఉమర్ మహమ్మద్.. అల్-ఫలాహ్ యూనివర్సిటీలో రెసిడెంట్ డాక్టర్గా పనిచేశాడు. ఇదే యూనివర్సిటీకి చెందిన మరో ఇద్దరు వైద్యులు ముజమ్మిల్ షకీల్, షాహీన్ షాహిద్ లను ఓ కేసులో పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలోని వైద్యులను.. ఈ ముగ్గురి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అయితే ఈ యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఇవి ఫేక్ వార్తలు అని.. వాస్తవాలను మిస్ లీడింగ్ చేస్తున్నారని పేర్కొంది. యూనివర్సిటీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయని స్పష్టం చేసింది. దిల్లీ బాంబు దాడి నిందితులకు.. యూనివర్సిటీకు ఎలాంటి సంబంధం లేదని యూనివర్సిటీ యాజమాన్యం చెబుతోంది. విశ్వవిద్యాలయం పరిసరాల్లో ఎలాంటి ప్రమాదకర కెమికల్ లేదని వివరించింది.

ఇక 'అల్ ఫలాహ్' యూనివర్సిటీని 2014 లో ఏర్పాటు చేశారు. సుమారు 70 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. అల్ ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్ట్ కింద ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టును 1995 లో ఏర్పాటు చేశారు. ఇదే పేరుతో ఇంజినీరింగ్ కాలేజీని సైతం 1997 లో నెలకొల్పారు. ఈ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫీజు రూ. 70 లక్షలుగా ఉంది. దిల్లీ బాంబు దాడి తర్వాత ఈ యూనివర్సిటీ పై కథనాలు వెలువడ్డాయి. పేలుడు జరిగిన కారును నడిపిన డాక్టర్ ఉమర్ మహమ్మద్, అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వైద్యుడేనని తెలుస్తోంది. ఇదే యూనివర్సిటీకి చెందిన మరో ఇద్దరు డాక్టర్లు ముజమ్మిల్ షకీల్, షాహీన్ షాహిద్ ను 2,900 కిలోల పేలుడు పదార్థాల కేసులో పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. దీంతో ఈ యూనివర్సీటీ పై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications