షాకింగ్: చలిలో మద్యం తాగితే అంతే సంగతి -వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక -న్యూ ఇయర్ పార్టీలు వద్దు
'చలి ఇరగేసేస్తోంది భయ్యా.. రెండు పెగ్గులు వేస్తేగానీ వణుకు తగ్గదు''.. ''దేశ సరిహద్దుల్లో సైనికులు చలిని తట్టుకోడానికి మద్యం తాగుతారు తెలుసా?''.. ''డిసెంబర్ 31 చలిరాత్రిలో స్నేహితులతో కూర్చొని మందేస్తే ఆ మజానే వేరు''.. తరహా డైలాగులు మనం తరచూ వింటుంటాం. కానీ వీటిలో ఏ ఒక్కటీ నిజం కాదు. చలిని తట్టుకునేలా ఒళ్లు వెచ్చాబడాలంటే మద్యం సేవించాలన్నది నూటికి నూరు శాతం అబద్ధపు ప్రచారం. అదే విషయాన్ని భారత వాతావరణ శాఖ మరోసారి తెలిపింది. తొలిసారి మందుబాబులకు హెచ్చరికలు జారీచేసింది. కొత్త ఏడాది ఉత్సవాలకు సిద్ధమవుతోన్న సాదారణ ప్రజానీకానికి కీలక సూచనలు చేసింది..
కరోనా విలయం: 6నెలల కనిష్ట రికార్డు -కొత్తగా 18,732 కేసులు -స్ట్రెయిన్ భయాలు.. షాకింగ్ నంబర్స్
రేపటి నుంచి మద్యం వద్దు..
సాధారణంగా వాతావరణ పరిస్థితులు, ప్రజలు అనుసరించాల్సిన జాగ్రత్తలను సూచించే భారత వాతావరణ శాఖ దాదాపు తొలిసారి మద్యపానంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటం, ఉత్తరభారతం నుంచి ప్రమాదకరమైన అతి శీతల గాలులు వీయనున్న నేపథ్యంలో మందుబాబులకు వార్నింగ్ ఇచ్చింది. ఈనెల 28 నుంచి శీతల పవనాల ప్రభావం ఉండనున్నందున.. చలిలో మద్యం సేవిస్తే.. శరీర ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయి, ఆరోగ్యానికి తీరని నష్టం కలుగుతుందని, కాబట్టి మద్యసేవనం వద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేడుకలపైనా వార్నింగ్
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోయే వేళ జనం ఆనందోత్సహాల్లో తేలడం, అందులో మద్యం ముఖ్య భూమిక పోషిస్తుండటం తెలిసిందే. డిసెంబర్ 31న మద్యం అమ్మకాల కోసం వైన్ షాపుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, బార్లు, క్లబ్బుల్లో అదనపు సీటింగ్స్ తదితర ఏర్పాట్లు ప్రతి ఏటా ఉండేవే. ఈ ఏడాది కరోనా విలయం నేపథ్యంలో భారీ వేడుకలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధించాయి. అయితే పరిమిత స్థాయిలో వేడుకలకు మాత్రం ఓకే చెప్పాయి.
పార్టీ చిన్నదయినా, పెద్దదయినా సరే, మద్యం జోలికి మాత్రం వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. సోమవారం(డిసెంబర్ 28) నుంచిఉత్తర భారతంలో చలి తీవ్రత పెరుగుతుందని, ఆ ప్రభావంతో దేశంలోని మిగతా ప్రాంతాలకూ తీవ్రమైన చలిగాలులు వీస్తాయని, అందువల్ల ప్రజలెవరూ బయట తిరుగరాదని, కొత్త సంవత్సర వేడుకల్లో మద్యానికి దూరంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.
మద్యంతో ఫ్లూ ప్రమాదం..
ఈనెల 28 నుంచి చలి తీవ్రతరం అయ్యే పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మందుబాబులు జాగ్రత్తగా ఉండాలని, ఫ్లూ, ముక్కుకారడం వంటి ఆరోగ్య ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితుల్లో మద్యపానం శరీర ఉష్ణోగ్రతలను మరింతగా తగ్గించి ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో ప్రజలు ఏం తినాలి, ఏం తాగాలనేదానిపైనా కీలక సూచనలు చేశారు..
విటమిన్-సీ పండ్లు మంచివి..
చలిగాలుల తీవ్రత పెరిగే సోమవారం నుంచి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, విటమిన్ సీ పుష్కలంగా ఉండే ద్రావకాలు తాగడం, సదరు విటమిన్ కలిగిఉండే పండ్లు ఎక్కువగా తినాలని వాతావరణ శాఖ సూచించింది. చలి తీవ్రతకు శరీరం పాడవ్వకుండా మాయిశ్చరైజర్లు వాడాలని, వెచ్చదనాన్నిచ్చే దుస్తుల్ని ధరించాలని, శరీర ఉష్ణోగ్రతను పెంచే వెచ్చటి పానియాలు తాగాలని సూచించారు. హిమాలయాల నుంచి వీచే చల్లని గాలులతో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు ఐదు నుంచి మూడు డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
జడ్జిలపై జగన్ పార్టీ మరో పిడుగు -అమ్మకానికి హైకోర్టు తీర్పులు -భారీ అవినీతి -ఎంఎస్ బాబు సంచలనం
చలికి ఆల్కహాల్ విరుగుడు కాదు
విపరీతమైన చలిని తట్టుకునేందుకు ఆల్కహాల్ ఒక ఉపాయమని చాలా మందికి తప్పుడు అవగాహన ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. చల్లని వాతావరణంలో మద్యం సేవించడం వల్ల మానవ శరీరం వణికే తీరుపై ప్రభావం పడుతుందని, శరీరం వేడిని కోల్పోతోందనడానికి మొదటి సంకేతం వణుకుడు అని యూఎస్ ఆర్మీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటర్ మెడిసిన్ అధ్యయనంలో పేర్కొన్నారు. చలిలో విపరీతమైన మద్య సేవనం ప్రాణాంతకం కూడా అవుతుందని ఓహియో వర్సిటీ సైంటిస్టు మైఖేల్ డిక్ పేర్కొన్నారు.