ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేస్తాం: ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం, ప్రస్తుతం 45ఏళ్లకు పైబడినవారికే
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు హక్కు వినియోగించుకున్న పోలింగ్ కేంద్రం వద్దే స్థానికులకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కారు ప్రారంభించింది. అంతేగాక, త్వరలో ఇంటి వద్దకే వచ్చి వ్యాక్సిన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
Recommended Video
వచ్చే నాలుగు వారాల్లోనే 45ఏళ్ల వయసుపైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేస్తామన్నారు. 70 మున్సిపల్ వార్డుల్లో వారం రోజులపాటు వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఒక బృందం ప్రతి ఇంటికి వెళ్లి టీకాలు వేయడానికి అర్హత ఉన్నవారికి స్లాట్లు కేటాయిస్తుంది. ఇది వ్యాక్సిన్ విషయంలో ఆందోళనలో ఉన్న పౌరులకు టీకాలు వేయడానికి ప్రోత్సహించడానికి కూడా తోడ్పడుతుంది.
వ్యాక్సిన్ సెంటర్లకు అర్హులైన పౌరులను తీసుకొచ్చి, ఇంటి వద్ద దిగబెట్టేందుకు ఈ రిక్షాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. రెండు నెలల తర్వాత 18-44ఏళ్ల వయస్కులకు కూడా ఇదే తరహాలో వ్యాక్సిన్ పంపిణీ చేసే అవకాశం ఉంది.
మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఆంక్షలను మరింతగా సడలించారు. షాపింగ్ మాల్స్, మార్కెట్లు, ప్రైవేటు కార్యాలయాలు తెరుచుకున్నాయి. వీటిని సరిబేసి పద్ధతిలో తెరవాలని ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మెట్రో రైలు సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, 50 శాతం సామర్థ్యంతో నడపనున్నారు. ప్రైవేటు కార్యాలయాలు కూా 50 కెపాసిటీతోనే నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు.
జూన్ 14 వరకు ఈ సడలింపులు కొనసాగుతాయని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. మూడో దశను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అయితే, ప్రజలు మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ, ఆ మహమ్మారి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో 500 లోపే కొత్త కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.