ఆసుపత్రిలో జయ ఇలా.., శశికళకు ఎప్పటికప్పుడు సమాచారం: లండన్ డాక్టర్
దివంగత జయలలితను ఆసుపత్రికి తీసుకు వచ్చినప్పుడు సీరియస్ ఇన్ఫెక్షన్ ఉందని లండన్ వైద్యులు రిచర్డ్ బాలే సోమవారం నాడు చెప్పారు.
చెన్నై: దివంగత జయలలితను ఆసుపత్రికి తీసుకు వచ్చినప్పుడు సీరియస్ ఇన్ఫెక్షన్ ఉందని లండన్ వైద్యులు రిచర్డ్ బాలే సోమవారం నాడు చెప్పారు. జయ ఆరోగ్యం పైన పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జయకు వైద్యం అందించేందుకు అపోలో ఆసుపత్రి వర్గాలు లండన్ నుంచి ప్రత్యేకంగా రిచర్డ్ బాలేను తీసుకు వచ్చారు. జయ మృతి పైన సందేహాలపై రిచర్డ్ బాలే స్పందించారు. ఆసుపత్రికి వచ్చే నాటికి ఆమెకు సీరియస్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. శరీరంలోని అవయవాలు దెబ్బతిన్నాయన్నారు.
'జయ చికిత్సకు రూ.5.5 కోట్లు, చివరిదాకా మాట్లాడారు, రాజకీయ ఒత్తిళ్లు లేవు'
గుండెపోటు రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జయలలితకు అత్యుత్తమ వైద్యం అందించామని తెలిపారు. అధిక రక్తపోటు, బీపీ కారణంగా ఆమె త్వరగా కోలుకోలేకపోయారని తెలిపారు.
ఎప్పటికప్పుడు శశికళకు సమాచారం
చికిత్స అందించిన తర్వాత జయలలిత కొంచెం కోరుకున్నారని చెప్పారు. జయ ఆరోగ్యంపై శశికళ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎప్పటికి అప్పుడు సమాచారం అందించామని తెలిపారు.
జయ పరిస్థితి విషమంగా ఉన్నందునే ఎవరిని కూడా తాము లోనికి అనుమతించలేదని చెప్పారు. తాము వైద్యులమే కానీ, విధానకర్తలం కాదని వైద్యులు చెప్పారు. వైద్యపరమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలమని చెప్పారు.
గుండెపోటు వల్లే మృతి
సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 29 వరకు జయలలిత వెంటిలెటర్ పైన ఉన్నారని చెప్పారు. బెడ్ మీద నుంచి లేచి అడుగులు వేసేవారని చెప్పారు. గుండెపోటు ఎప్పుడు వస్తుందో చెప్పలేమని, గుండెపోటు కారణంగానే ఆమె మృతి చెందారని చెప్పారు. ఆమెకు హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని తెలిపారు.
కాళ్లు తీసేశామని చెప్పడం సరికాదు
జయలలితకు కాళ్లు తీసేశామని చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. చివరి నిమిషం వరకు ఆమె మాట్లాడుతూనే ఉన్నారని చెప్పారు. జయలలిత చికిత్స కొసం రూ.5.5 కోట్లు ఖర్చయిందని చెప్పారు.
గవర్నర్ వచ్చినప్పుడు ఆమె బాగానే ఉన్నట్లు సిగ్నల్స్ ఇచ్చారని చెప్పారు. ఈ విషయం కోర్టు పరిదిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్పలేమని అన్నారు. ట్రీట్మెంట్ను సీసీ కెమెరాల్లో రికార్డు చేయడం ఏమాత్రం సరికాదని చెప్పారు.
జయలలిత కాళ్లు తొలగింపు?: వివరణ ఇచ్చిన అపోలో ఛైర్మన్ ప్రతాప్
రెండు రోజుల క్రితం అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కూడా స్పందించారు. జయలలితకు అందించిన వైద్యానికి సంబంధించి వివరాలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నామని అపోలో ఆస్పత్రుల ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి స్పష్టం చేశారు. జయలలితకు అందించిన చికిత్సను ఎప్పటికప్పుడు వెల్లడించామన్నారు.
చెన్నైలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ప్రతాప్ సి రెడ్డి సమాధానమిచ్చారు. జయలలిత మృతిపై వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. జయలలిత కాళ్లను తొలగించినట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులేనని చెప్పారు.
జయలలిత మరణానికి సంబంధించిన అన్ని వివరణలను ఆసుపత్రి యంత్రాంగం తరఫున ఇప్పటికే బహిర్గతం చేశామన్నారు. సీబీఐ దర్యాప్తు చేసినా సమగ్ర వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతాప్ సి రెడ్డి తెలిపారు.