ఆప్ఘన్ లో భూకంపం-ఢిల్లీ, కశ్మీర్ లో ప్రకంపనలు- 5.7 తీవ్రతతో
ఆప్ఘనిస్తాన్-తజికిస్ధాన్ సరిహద్దుల్లో ఉన్న హిందూకుష్ పర్వత శ్రేణుల్లో ఇవాళ భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో చోటు చేసుకున్న ఈ భూకంపం ప్రభావం భారత్ పైనా కనిపించింది. జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీతో పాటు జమ్ము కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో జనం అప్రమత్తమై రోడ్లపై పరుగులు తీశారు.
ఆప్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దుల్లోనే భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడాలో 20 సెకన్ల పాటు భూమి కంపించిందని స్ధానికులు ట్వీట్లు చేశారు. అలాగే ఢిల్లీ నగరంలోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని పలువురు స్దానికులు చెప్తున్నారు. జమ్ముకశ్మీర్ పైనా ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఆఫ్ఘనిస్తాన్-తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉదయం 9:45 గంటలకు 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్వీట్ చేసింది. భూకంపం యొక్క లోతు 181 కి.మీ. ఉందని తెలిపింది.
అయితే ఈ భూకంపం లేదా ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తినష్టం కానీ చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురైనట్లు మాత్రమే తెలిసింది. ఆ తర్వాత టీవీల్లో భూకంప వార్తలు విని కాసేపు ఆందోళనకు గురయ్యారు. చివరికి భూకంప కేంద్రం ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉందని తెలిసి ఊరట పొందారు.
ఆప్ఘన్ సరిహద్దుల్లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో భూకంపాలు సహజమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటి ప్రభావం భారత్ పై అంత ఎక్కువగా లేదని తాజా నివేదికలు కూడా చెప్తున్నాయి. వీటి వల్ల ప్రజలకు తాత్కాలికంగా కొంత ఆందోళన మాత్రం తప్పడం లేదు.