ముంబైకి ఏక్ నాథ్ షిండే-2/3 మెజారిటీతో బీజేపీకి మద్దతుకు రెడీ-కోవిడ్ తో ఆస్పత్రిలో గవర్నర్
మహారాష్ట్రలో నిన్న అధికార శివసేనలో తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం గంటగంటకో మలుపు తిరుగుతోంది. నిన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్ లోని సూరత్ వెళ్లిన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే .. అనంతరం అస్సోంకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఇవాళ ప్రత్యేక విమానంలో తిరిగి ముంబైకి వచ్చే్ందుకు సిద్దమవుతున్నారు. సీఎం ఉద్ధవ్ థాక్రేతో నిన్న జరిపిన చర్చలు విఫలం కావడంతో ఏక్ నాథ్ షిండే తీసుకోబోయే నిర్ణయాలు సంచలనంగా మారబోతున్నాయి.
పతనం అంచున్న మహా సర్కార్
మహారాష్ట్రలో అధికార శివసేనలో తలెత్తిన తిరుగుబాటు ప్రభావం మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్యాంపు రాజకీయాలు నడుపుతున్న రెబెల్ నేత ఏక్ నాథ్ షిండేను అడ్డుకునేందుకు సీఎం ఉద్ధవ్ థాక్రే చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుంటోంది. దీంతో సీఎం ఉద్ధవ్ ఇవాళ అత్యవసర కేబినెట్ భేటీ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇదే సమయంలో రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ముంబైకి తిరుగుప్రయాణమవుతున్నారు.
ముంబైకి ఏక్ నాథ్ షిండే
నిన్న అనూహ్యంగా 15 మంది ఎమ్మెల్యేలతో గుజరాత్ లోని సూరత్ కు వెళ్లి క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టిన ఏక్ నాథ్ షిండేకు ఆ తర్వాత మరింత మంది శివసేన ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో ఆయన వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 35 నుంచి 40 వరకూ పెరిగింది. దీంతో శివసేనలో చీలిక తప్పదనిపిస్తోంది. ఇప్పటికే శివసేనకు ఉన్న 64 మంది ఎమ్మెల్యేల్లో ఏక్ నాథ్ షిండే శిబిరానికి 40 మంది ఎమ్మెల్యేల వరకూ వెళ్లిపోయారు. దీంతో ఉద్ధవ్ థాక్రే ఒంటరైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన నిర్వహించే కేబినెట్ భేటీకి హాజరయ్యే మంత్రుల ఆధారంగా తదుపరి పరిణామాలపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
శివసేన చీలికకు షిండే రెడీ
శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకుంటున్న ఏక్ నాథ్ షిండే ఆ పార్టీని చీల్చేందుకు సిద్ధమయ్యారు. తనకు శివసేనలో 2/3 వంతు ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారని చెప్తున్న ఏక్ నాథ్ షిండే ఆ మేరకు ఇవాళ ముంబైకి తిరిగి వచ్చి బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీఎం ఉద్ధవ్ థాక్రేతో ఆయన జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఏక్ నాథ్ షిండే కోరుతున్నట్లు బీజేపీకి మద్దతిచ్చేందుకు ఉద్ధవ్ సిద్ధం కాలేదు. దీంతో శివసేనలో చీలికకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు ముంబై తిరిగి వచ్చాక గవర్నర్ ను కలిసేందుకు షిండే రెడీ అవుతున్నారు.
కోవిడ్ తో ఆస్పత్రిలో చేరిన గవర్నర్
శివసేనలో చీలిక తీసుకొచ్చి మెజారిటీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంటున్న ఏకే నాథ్ షిండే ఇవాళ ముంబైకి రాగానే గవర్నర్ ను కలిసి శివసేన పార్టీ తనదేనని చెప్పుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో అత్యధికులు తనకే మద్దతిస్తున్నారని, కాబట్టి తనదే అసలైన శివసేనగా గుర్తించాలని ఆయన కోరబోతున్నారు. ఆ తర్వాత బీజేపీకి మద్దతుగా లేఖ కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఈ వివాదం గవర్నర్ కోర్టులోకి వెళ్లబోతున్న తరుణంలో ఆయన ఆస్పత్రిపాలయ్యారు. కోవిడ్ సోకడంతో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని ఆస్పత్రిలో చేర్చారు. కోషియారీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కానీ ఈ వివాదం తేలేలా లేదు. దీంతో మరికొన్నిరోజులు మహారాష్ట్రలో ఉత్కంఠ కొనసాగేలా ఉంది.