మహా రాజకీయంలో భారీ ట్విస్ట్ - సీఎంగా షిండే : వ్యూహం మార్చిన బీజేపీ - ఈ సాయంత్రం ప్రమాణం..!!
కొద్ది రోజులు అనేక టర్న్ లు తీసుకుంటున్న మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ నుంచి కాకుండా శివసేన రెబల్ నేత ఏక్ నాధ్ షిండేను మహారాష్ట్ర సీఎం చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర గవర్నర్ కు బీజేపీ అధికారికంగా వెల్లడించింది. షిండే సీఎం చేసేందుకు తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కీలక ప్రకటన చేసారు. ఈ సాయంత్రం 7.30 గంటలకు ఏక్ నాధ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు.
చివరి నిమిషంలో మారిన బీజేపీ వ్యూహం
మహారాష్ట్రలో గత ఎన్నికల సమయంలో ప్రజలు బీజేపీ - శివసేన కూటమికి మద్దతుగా తీర్పు ఇచ్చారని చెప్పారు. అయితే, థాక్రే మాత్రం బాలా సాహెబ్ - సావర్కర్ లక్ష్యాలకు విరుద్దంగా వ్యవహరించారని ఆరోపించారు. షిండే కు తాము బయట నుంచి మద్దతు ఇస్తామని ఫడ్నవీస్ వెల్లడించారు. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కూల్చారనే అపవాదు లేకుండా.. థాక్రేను పదవి నుంచి దింపి షిండేకు ఆ బాధ్యతలు అప్పగించాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. శివసేన ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యత తమదేనని ఫడ్నవీస్ స్పష్టం చేసారు.
బయట నుంచి బీజేపీ మద్దతు
అదే సమయంలో.. శివసేన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటానికి తమకు అభ్యంతరం లేదనే విషయాన్ని ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేస్తోంది. ఆ సాయంత్రం సీఎంగా షిండే ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. శాసనసభలో బల పరీక్ష తరువాత కేబినెట్ కొలువు తీరనుంది. దాదాపుగా మొత్తం రెబల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవులు దక్కనున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలు.. విమర్శలను పరిగణలోకి తీసుకొని బీజేపీ తన వ్యూహం మార్చినట్లుగా స్పష్టం అవుతోంది. దీంతో..ఆటో డ్రైవర్ గా జీవితం ప్రారంభించిన షిండే ఇప్పుడు మహారాష్ట్ర ను డ్రైవ్ చేయనున్నారు.
శివసేన రెండో సీఎంగా షిండే
దీంతో..ఇప్పుడు తాజాగా మహారాష్ట్రంలో బీజేపీ మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పడనుంది. ఏక నాధ్ షిండే నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుండటంతో.. భవిష్యత్ చోటు చేసుకొనే పరిణామాల పైన ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. దీంతో..ఇప్పుడు వ్యూహం మార్చిన బీజేపీ..రానున్న ఏం చేస్తుందనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. శివసేన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం ద్వారా మహారాష్ట్రలో శివసేన వైపు సానుభూతి వెళ్లకుండా.. తమ భవిష్యత్ రాజకీయాలకు ఇబ్బంది లేకుండా బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. థాక్రేతో విభేదించినా సిద్దాంత పరంగా తామంతా ఒక్కటేనని షిండే చెప్పారు.