జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ విఎస్ సంపద్ శనివారం విడుదల చేశారు. వరదల కారణంగా ఎన్నికల షెడ్యూల్ ఆలస్యమైనట్లు ఆయన తెలిపారు. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐదు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు.
జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో నవంబర్ 25న మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. డిసెంబర్ 2న రెండో దశ, డిసెంబర్ 9న మూడో విడత, డిసెంబర్ 14న నాలుగో దశ, డిసెంబర్ 20న ఐదో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని చెప్పారు. డిసెంబర్ 23న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు.
రెండు రాష్ట్రాల్లోనూ నోటా ఓటుకు అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో 87 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జనవరి 19తో జమ్మూకాశ్మీర్ ప్రస్తుత అసెంబ్లీ కాలం ముగియనుంది. కాశ్మీర్ రాష్ట్రంలో 10,050 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
జార్ఖండ్ రాష్ట్రంలో 81 శాసనసభా స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో 24,648 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. జనవరి 3తో జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ కాలం ముగియనుంది.
జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలకు నవంబర్ 29న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, జమ్మూకాశ్మీర్లో నవంబర్ 28న నోటీఫికేషన్ జారీ కానుంది. కాగా, నవంబర్ 25న ఢిల్లీలోని 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.