ఎన్నికల రాష్ట్రాల్లో పార్టీలకు షాక్- ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధాన్ని పొడిగించే యోచనలో ఈసీ
ఉత్తర్ ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ర్యాలీలు, సభలు, రోడ్ షోలపై ఈసీ నిషేధం కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ లో ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఓసారి పొడిగించింది కూడా. ఇప్పుడు మరోసారి ఈ నిషేధాన్ని పొడిగించేందుకు ఈసీ సిద్ధమవుతోంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత జనవరి 15 వరకూ ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలపై ప్రకటించిన నిషేధాన్ని ఈసీ మరో వారం పాటు పొడిగించింది. ఆ గడువు కూడా ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇవాళ సాయంత్రానికి ఈసీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీల కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీని కోసం అభ్యర్ధులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఈసీ ఆంక్షలతో అభ్యర్ధులు ఇళ్ల వద్ద నుంచే వర్చువల్ ప్రచారం చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి, సభలు పెడితేనే ఓట్లు పడతాయో లేదో తెలియని పరిస్దితుల్లో వర్చువల్ ప్రచారాలతో తీవ్ర నష్టం జరుగుతందని పార్టీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. పరిమితంగానైనా ప్రచారానికి అనుమతి ఇవ్వాలని ఈసీని కోరుతున్నాయి.
Recommended Video
అయితే ఎన్నికలు జరిగే యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాల్లో కోవిడ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గడం లేదు. అలాగే వ్యాక్సినేషన్ కూడా వందశాతం పూర్తి కాలేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని వదిలేస్తే భారీ ఎత్తున కోవిడ్ వ్యాప్తికి అవకాశం ఉందన్న నివేదికలు వస్తున్నాయి. దీంతో మరో వారం రోజులైనా భౌతిక ప్రచారంపై ఆంక్షలు కొనసాగించాలని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈసీ ఆంక్షలతో పార్టీలు కేవలం 300 మందికి మించకుండా జనంతో ఇండోర్ మీటింగ్ లు మాత్రం పెట్టుకుంటున్నాయి. ఈసీ త్వరలో ఆంక్షలు ఎత్తేస్తుందని రాజకీయ పార్టీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.