నచ్చజెప్పినా వినలేదు.. తీసుకెళ్లిపోయారు.. భారత్లోనే ఉంటే ఆమె ప్రాణాలైనా దక్కేవి!
ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరొందిన ఎమాన్ అహ్మద్ చనిపోవడంపై ముంబైలో ఆమెకు చికిత్స అందించిన వైద్యులు స్పందించారు. ఎమాన్ను భారత్ నుంచి తీసుకెళ్లడమే ఆమె మృతికి కారణమైందని బేరియాట్రిక్ సర్జన్ అప
ముంబై : ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరొందిన ఎమాన్ అహ్మద్ చనిపోవడంపై ముంబైలో ఆమెకు చికిత్స అందించిన వైద్యులు స్పందించారు. ఎమాన్ను భారత్ నుంచి అబుదాబికి తీసుకెళ్లడమే ఆమె మృతికి కారణమైందని బేరియాట్రిక్ సర్జన్ అపర్ణా గోవిల్ భాస్కర్ ఆరోపించారు.
పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అయ్యేవరకూ ఎమాన్ను ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని తాము ఎంతగానో నచ్చజెప్పామని, అయినా ఎమాన్ కుటుంబసభ్యులు తమ మాట వినలేదని తెలిపారు.
ఎమాన్ చనిపోవడాన్ని సైఫీ ఆస్పత్రి వైద్యులు జీర్ణించుకోలేకపోతున్నారని. 20 మంది డాక్టర్ల బృందం ఎమాన్కు మెరుగైన సేవలు అందించినా.. చివరివరకూ ఇక్కడే ఉంచకపోవడమే ఎమాన్ ప్రాణాల్ని బలితీసుకుందని అపర్ణా గోవిల్ భాస్కర్ వ్యాఖ్యానించారు.
ఈజిప్టు, భారత్, గల్ఫ్ ఎమిరేట్స్ దేశాల్లో అధిక బరువుకు చికిత్స తీసుకున్న ఎమాన్ సోమవారం అబుదాబిలోని బుర్జీల్ ఆస్పత్రిలో కన్నమూశారు. అధిక బరువుతో సతమతమవుతున్న 37 ఏళ్ల ఎమాన్ ట్రీట్మెంట్ కోసం గత ఫిబ్రవరిలో ఈజిప్ట్ నుంచి ముంబైకి వచ్చిన ఆమె బేరియాట్రిక్ సర్జరీతో దాదాపు 330 కిలోల బరువు తగ్గారు.
చికిత్స పూర్తికాకముందే ఆమె సోదరి షైమా సెలీమ్ మే నెలలో యూఏఈకి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న ఎమాన్ దురృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయి వార్తల్లో నిలిచారు. ఆమె మృతికి .. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీలు పనిచేయకపోవడం వంటి సమస్యలు ప్రధాన కారణాలయ్యాయి.
ఎమాన్ మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో మంగళవారం ఎమాన్కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.