అనూహ్య కేసు: దక్షిణాది వ్యక్తే, మద్యం తాగించి హత్య!
ముంబై/విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో ముంబై పోలీసులు కొంత పురోగతి సాధించారు. అనూహ్య ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్లో రైలు దిగిన తర్వాత ఆమెతో పాటు బయటకు నడిచిన వ్యక్తి దక్షిణాదికి చెందినవాడిగా అనుమానిస్తున్నారు.
ఆ కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో గల దక్షిణాది ముఠాలకు చెందిన నేరస్థులను విచారించనున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో అనూహ్య రక్త నమునాలకు బంధవారం పరీక్షలు నిర్వహించారు. ఆమె శరీరంలో మద్యం ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆమెకు మొదట మద్యం తాగించి అనంతరం హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
కాగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసు దర్యాప్తులో ముంబైలోని ప్రభుత్వ రైల్వే పోలీసు (జిఆర్పీ) విభాగం సరికొత్త పంథాను అనుసరించిన విషయం తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా విశిష్ట గుర్తింపు సంఖ్య 'ఆధార్' ఆలంబనగా విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ముంబై శివార్లలో అనుమానాస్పద పరిస్థితుల నడుమ సగం కాలిన అనూహ్య మృతదేహం లభ్యమైంది.
ఈ కేసులో సమాంతర దర్యాప్తు సాగిస్తున్న జిఆర్పీ, ముంబై పోలీసులతో కలసి కొత్త బాటలో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా నగరంలోని ఆధార్ నమోదు కేంద్రాల నుంచి సమాచారం కోరినట్లు కుర్లా రైల్వే స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ శివాజీ ధుమాల్ చెప్పారు. జనవరి 5 తెల్లవారుజామున 4:45 నుంచి ఉదయం 6:00 గంటల మధ్య ఆమె చేసిన, అందుకున్న కాల్స్ జాబితాను సెల్ ఫోన్ కంపెనీల నుంచి కోరారు. ఆయా ఫోన్ నంబర్లను ఆధార్ సమాచార నిధికి జోడించి, వాటి సొంతదారులెవరో కూపీ లాగనున్నారు.