పెట్రోల్లో ఇథనాల్ కలపడంపై మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన!
ఇండియాలో పెట్రోలులో ఇథనాల్ కలపడం, దాని శాతం పెంపుపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై మోదీ సర్కారు కీలక ప్రకటన చేసింది. పెట్రోల్లో ఇథనాల్ పరిమితిని 20 శాతానికి పెంచే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రకటించింది. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో భవిష్యత్తులో ఏవైనా మార్పులు చేయాలంటే విస్తృతమైన శాస్త్రీయ అధ్యయనాలు, సంబంధిత భాగస్వాములతో చర్చలు జరిపిన తర్వాతే చేస్తామని వెల్లడించారు. ఇటీవల E20 పెట్రోల్పై తీవ్ర గందరగోళం నెలకొనడంతో ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటులో తన వైఖరిని తెలియజేసింది.
పెట్రోల్లో ఇథనాల్ కలపడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొనడంతో తాజా మోదీ ప్రభుత్వం ఈ కీలక అంశంపై పార్లమెంటులో తన అభిప్రాయాలను వెల్లడించింది. దేశంలో పెట్రోల్లో 20 శాతానికి మించి ఇథనాల్ కలపడంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది. వాస్తవానికి ఇటీవలి కాలంలో E20 ఇంధనం, దానిలో ఇథనాల్ పరిమాణాన్ని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర గందరగోళం చెలరేగింది. ఆ తర్వాత ప్రభుత్వం E25 లేదా E30 అనే ఆలోచనను విరమించుకుంది.

E85 ఇంధనం కేవలం నిర్దిష్ట వాహనాలకు మాత్రమే..
ఇదే సమయంలో E85 ఇంధనం గురించిన అపోహలను కూడా కేంద్ర ప్రభుత్వం తొలగించింది. పెట్రోల్లో ఇథనాల్ కలిపే విషయమై ఈ85 ఇంధనాన్ని (85 శాతం ఇథనాల్ , 15 శాతం పెట్రోల్) కేవలం ఈ ప్రయోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల కోసం మాత్రమే ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సాధారణ పెట్రోల్లో ఇథనాల్ కలిపే పరిమితిని 20 శాతానికి మించి పెంచడం దీని ఉద్దేశం కాదన్నారు. ఇండియాలో ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్, ఏఆర్ఏఐ, సియామ్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహకారంతో దశలవారీగా శాస్త్రీయ పద్ధతిలో అమలు చేస్తున్నారు.
E20 ఇంధనం వల్ల ఇంజిన్లకు నష్టం జరుగుతుందా?
ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజిన్లు తుప్పు పట్టి పాడవుతాయన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో E15+ మిశ్రమం 3.5 సంవత్సరాలుగా, E19-E20 ఇంధనం రెండున్నర సంవత్సరాలకు పైగా వాడుకలో ఉన్నాయి. ఈ సమయంలో లక్షలాది ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు ఈ ఇంధనాలతో నడిచాయి, కానీ ఇథనాల్ కారణంగా ఇంజిన్కు విస్తృత నష్టం లేదా అసాధారణ తుప్పు పట్టినట్లు ధృవీకరించబడిన కేసులు ఏవీ లేవని ప్రభుత్వం వెల్లడించింది. వాహన తయారీ కంపెనీలు కూడా E20 కంప్లైంట్ వాహనాలపై సాధారణ వారంటీలను ఇస్తున్నాయని గుర్తుచేసింది.
E20 ఇంధనం వల్ల కలిగే అనేక ప్రయోజనాలు
ఈ E20 ఇంధనం వల్ల మైలేజీ తగ్గుతుందనే విషయంపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పాత E10 మోడల్ వాహనాల్లో మైలేజ్ 3 నుంచి 5 శాతం వరకు మాత్రమే తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయితే E20 ఇంధనం అధిక ఆక్టేన్ రేటింగ్ కలిగి ఉండటం వల్ల ఇంజిన్ సున్నితంగా పని చేస్తుందని.. మెరుగైన యాంటీ-నాక్ సామర్థ్యాన్ని ఇస్తుందని వివరించింది. అంతే కాకుండా తక్కువ కార్బన్ ఉద్గారాల వల్ల వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది.














Click it and Unblock the Notifications