నేను కూడా ఫైన్ కట్టాను.. కొత్త మోటారు వాహన చట్టం ఫైన్లపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
ముంబై : కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారుల జేబులకు ట్రాఫిక్ పోలీసులు చిల్లు పెడుతున్నారు. అయితే భారీ మొత్తంలో ఫైన్ వేయడంతో వాహనదారులు మండిపడుతున్నారు. దీనిపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నందునే కఠిన నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. మోడీ 2.0 ప్రభుత్వంలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం, జమ్ము కశ్మీర్ విభజన, కొత్త మోటారు వాహన చట్టం .. చట్టబద్దమవడం కీలక నిర్ణయాలని పేర్కొన్నారు.
రాష్ట్ర బడ్జెట్ లో జాతీయ అంశాలను వల్లె వేసిన కేసీఆర్..!ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి అదే కారణమన్న సీఎం
జరిమానాల మోత
ఇటీవల గురుగ్రామ్లో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ నంబర్, హెల్మెట్ తదితర పేర్లతో వేలకు వేలు ఫైన్ ముక్కు పిండి మరీ చలానా వసూల్ చేస్తున్నారు. గురుగ్రామ్లో టూవీలర్ ఫైన్తో మొదలైన పరంపరం ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లకు కూడా భారీ మొత్తంలో జరిమానా విధించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అమలు చేస్తోన్న రాష్ట్రాల్లో కూడా ఫైన్ బాదుతున్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.
ఫైన్ కట్టానే..
ఇటీవల తన వాహనం బాంద్రా వర్లీ దారిలో వేగంగా వెళ్లిందని గుర్తుచేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందున తాను కూడా ఫైన్ కట్టానని వివరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని .. ఎవరు అతీతులు కారని పేర్కొన్నారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో కొత్త మోటారు వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామని వివరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసమే కఠిన నిర్ణయం తీసుకున్నమని వెల్లడించారు.
3 కీలక నిర్ణయాలు
కొత్త మోటారు వాహన చట్టం గత నెలలో చట్టబద్దమైంది. దీనికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో అమల్లోకి వచ్చింది. చట్టంతో జరిమానాలకు సంబంధించి పారదర్శకత పెరుగుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఫైన్లకు సంబంధించి అవినీతికి చోటుండదని పేర్కొన్నారు. మోడీ 2.0 ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా 3 కీలక పథకాలు అమలు చేశామని గుర్తుచేశారు. ముస్లిం మహిళలకు శ్రీరామరక్ష అయిన ట్రిపుల్ తలాక్, కశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగించడం, కొత్త మోటారు వాహన చట్టం అని వివరించారు. వీటితో తమ ప్రభుత్వానికి కీలక అంశాలపై ఉన్న చిత్తశుద్ధి నిదర్శమన్నారు.