కాశ్మీర్లో టెన్షన్: అర్దరాత్రి మాజీ ముఖ్యమంత్రుల అరెస్ట్:కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం
జమ్ము కాశ్మీర్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోబోతుందనే విషయం చాలా స్పష్టంగా అర్దం అవుతోంది. సాంప్రాదాయానికి భిన్నంగా కేంద్ర కేబినెట్ మరి కాసేపట్లో సమావేశం కాబోతోంది. ఇదే సమయంలో అనూహ్యంగా ఆర్దరాత్రి మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముప్తిలను గృహనిర్భం దంలోకి తీసుకున్నారు. శ్రీనగర్ లో 144 వ సెక్షన్ విధించారు. పార్లమెంట్ వేదికగానే పరిణామాలు చోటు చేసుకుంటా యని గవర్నర్ స్పష్టం చేసారు. దీంతో..కేబినెట్ సమావేశం..పార్లమెంట్..జమ్ము కాశ్మీర్ ..ఇలా ప్రతీ అడుగు పైనా దేశ వ్యాప్తంగానే కాదు..అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొని ఉంది.
అర్దరాత్రి అదుపులోకి మాజీ ముఖ్యమంత్రులు..
జమ్ము కాశ్మీర్లో క్షణ క్షణానికి టెన్షన్ పెరుగుతోంది. మరి కాసేపట్లో కేంద్రం జమ్ము కాశ్మీర్ విషయంలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో భారీగా బలగాలను మోహరించిన కేంద్రం..మరో వైపు అక్కడ ఎటువం టి ఆందోళనలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఇదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముప్తిలను గృహనిర్భం దంలోకి తీసుకున్నారు. వారిని గడప దాటనివ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. శాంతంగా ఉండాలని ప్రజలకు ఓ ట్వీట్ ద్వారా ఒమర్ విజ్ఞప్తి చేశారు. ‘రేపు ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలి. ఈ రాత్రి సుదీర్ఘంగా ఉండబోతోంది' అని మెహబూబా ట్వీట్ చేశారు. తమను పోలీసులు అరెస్టు చేశారని కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామి పేర్కొన్నారు.
గవర్నర్ కీలక సమావేశం..సూచనలు
జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కశ్మీర్ ఐజీలతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ అర్ధరాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను సోమవారం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటిం చారు. అమిత్షా కశ్మీర్లో పర్యటనకు సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు.. జమ్మూకశ్మీర్లో ఎలాంటి అవాంఛ నీయ పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు సంసిద్ధమయ్యాయి. శ్రీనగర్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో అడుగడుగునా బలగాలను మోహరించారు. రాష్ట్రంలో అంతర్జాల సేవల్ని నిలిపివేశారు. సందట్లో సడేమియాలా భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు పొంచి చూస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే పలుమార్లు చొరబాటు యత్నాల్ని మన సైనికులు సమర్థంగా తిప్పికొట్టినా, కొంతమంది ఉగ్రవాదులు మన భూభాగం లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. పర్యాటకులు, విద్యార్థులు, ఇతర రాష్ట్రాలవారిని ఆగమేఘాలపై పంపించి వేసే ప్రక్రియను వేగవంతం చేసారు.
కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం..
సాధారణంగా ప్రతీ బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంటుంది. అయితే, జమ్ము కాశ్మీర్లో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్రం మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. జమ్మ కాశ్మీర్లో తీసుకొనే నిర్ణయాల పైన పలు రకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు.. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పి స్తున్న రాజ్యాంగ అధికరణాల రద్దు, రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఏదైనా ప్రయత్నం జరిగితే గట్టిగా ప్రతిఘటిం చాలని ఆ రాష్ట్రానికి చెందిన రాజకీయ పక్షాల సమావేశం తీర్మానించడం, రాజ్యాంగ ప్రతిపత్తిని కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునివ్వడం వేడిని పెంచింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల్ని పెంచే ఎలాంటి చర్యలకూ పాల్పడకూడదని ఆ సమావేశం భారత్, పాకిస్థాన్లకు స్పష్టం చేసింది. ఇప్పుడు కేంద్రం ఏరకమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.