ఒరాప్ ఇష్యూ: ఢిల్లీలో మాజీ సైనికుడి ఆత్మహత్య
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని జంతర్ మంతర్ దగ్గర హర్యానాకు చెందిన ఓ మాజీ సైనికుడు మంగళవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఒరాప్) అంశంపై 70ఏళ్ల మాజీ సైనికుడు రాంకిషన్ గ్రేవాల్ విషం తాగి ఓ పార్కులో బలవన్మరణానికి ఒడిగట్టాడు.
ఒరాప్ అంశంపై రక్షణ మంత్రికి మెమోరాండం సమర్పించేందుకు పలువురు మాజీ సైనికులు ఢిల్లీ వచ్చారని పోలీసులు తెలిపారు. ఒరాప్ అంశంపై తీవ్ర నిరాశకు గురైన గ్రేవాల్ మాత్రం పార్కులోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన స్నేహితులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒరాప్ పథకం అమలుపై పలువురు మాజీ సైనికులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, సైనికుల ప్రయోజనాల కోసమే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాంకిషన్ వద్ద లభించిన సూసైడ్ నోట్లో ఆయన పేర్కొన్నారు.

మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియగానే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు.
కాగా, ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఒరాప్ పథకాన్ని అమలు చేయడం కోసం మొదటి ఇన్స్టాల్మెంట్గా సుమారు రూ. 5,500 కోట్లను చెల్లించనున్నట్లు తెలిపారు. మాజీ సైనికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
రాహుల్ గాంధీని అడ్డుకున్న పోలీసులు
ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తనను అడ్డుకోవడం అప్రజాస్వాకమంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications