సహనం: హిందూ ఖైదీలను విడిపించిన ముస్లింలు
న్యూఢిల్లీ/లక్నో: దేశంలో ఓవైపు 'అసహనం' పేరిట రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో జైల్లో మగ్గుతున్న 15 మంది హిందువుల కోసం ముస్లింలు నిధుల సమీకరణకు ముందుకు వచ్చారు. రూ. 50 వేలను సేకరించి వారిని విడిపించారు. సహనం చాటుకున్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది.
జైల్లోని వారంతా టికెట్ లేకుండా ప్రయాణాలు వంటి చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కున్న వారే కావడం గమనార్హం. వీరు జరిమానాలు కట్టలేక నెలల తరబడి కరుడుగట్టిన ఖైదీల మధ్య కాలం గడుపుతున్నారు.
దీంతో వీరందరి జరిమానాలను ఖురేషి అనే వ్యక్తి ఆధ్వర్యంలో కొందరు ముస్లింలు డబ్బులు సేకరించి కట్టగా.. మొత్తం 15 మంది ఖైదీలు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. వీరిలో కొంతమంది తమకు విధించిన పూర్తి శిక్షాకాలాన్ని ముగించి కూడా, జరిమానా కట్టలేక జైల్లోనే ఉండిపోయిన వారు కూడా ఉన్నారు.
కాగా, ఈ విధంగా కోర్టు విధించిన జరిమానా కట్టలేని వారెందరో జైల్లో ఉన్నారని బరేలీ జైలు సూపరింటెండెంట్ బీఆర్ మౌర్య వెల్లడించారు.
ఇది ఇలా ఉండగా, ఇతరులకు సహాయం చేస్తే అల్లా ఆశీర్వదించి అందరికీ మంచి చేస్తాడని ఖైదీలను విడిపించిన ముస్లింలు తెలిపారు. కాగా, జైలు నుంచి విడుదలైన హిందువులు తమను విడిపించిన ముస్లిం సోదరులను హత్తుకుని కృతజ్ఞలు తెలిపారు.
ఈ సందర్భంగా డబ్బులు సేకరించిన వారిలో ఒకరైన హజి మొహ్మద్ అనీస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారతదేశం మా మాతృభూమి. హిందువులందరూ మా సోదరులు' అని పేర్కొన్నారు.