Union Budget 2020: అద్భుతః..వ్యవసాయం పరుగులు: అయిదు ట్రిలియన్ డాలర్ల మార్క్: కన్నా, సుజనా
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దేశానికి వెన్నెముకగా చెప్పుకొనే వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ ఉందని వ్యాఖ్యానించింది. వ్యవసాయ రంగానికి ఇంతలా ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం మరొకటి లేదని స్పష్టం చేసింది. వ్యవసాయానికి పెద్దపీట వేయడం వల్ల ఆ రంగంలోో శీఘ్ర ప్రగతి సాధ్యపడుతుందని బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇన్ఛార్జి సునీల్ దేవ్ధర్, అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకుడు సుజనా చౌదరి, మాజీమంత్రి పైడికొండాల మాణిక్యాల రావు అన్నారు.
మోదీగారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో అద్భుతమైన బడ్జెట్ ఇది.
— Kanna Lakshmi Narayana (@klnbjp) February 1, 2020
ఈ బడ్జెట్ అమలుతో వ్యవసాయరంగం శీఘ్ర ప్రగతి సాధిస్తుంది.దేశంలో సంక్షేమం,అభివృద్ధి,
మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా వ్యాపార,నూతన ఉద్యోగ కల్పన,పారిశ్రామిక వృద్ధితో భారత్ వేగంగా 5 ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్థను అందుకుంటుంది. pic.twitter.com/Hof2yOy5A6
నిర్మలా సీతారామన్ బడ్జెట్
నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన కొద్దిసేపటికే వారంతా ట్విట్టర్ ద్వారా తన స్పందనను వారు తెలియజేశారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో అద్భుతమైన బడ్జెట్ అంటూ కితాబిచ్చారు. దేశంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో సాగడానికి ఈ బడ్జెట్ ఉపకరిస్తుందని, ప్రత్యేకించి వ్యవసాయ రంగాన్ని పరుగులెత్తించేలా ఉందని అన్నారు. వ్యవసాయానికి ఏకంగా 2.83 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించడం హర్షణీయమని కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి చెప్పారు.
పారిశ్రామిక రంగంలో అద్భత ప్రగతి..
పారిశ్రామిక రంగాన్ని కూడా విస్మరించలేదని చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన అంశాల వల్ల పారిశ్రామిక వృద్ధిరేటు అతి త్వరలోనే అయిదు ట్రిలియన్ డాలర్ల మార్క్ను అందుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రవాణా రంగానికి 1.73 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారని, ఫలితంగా మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని అన్నారు. రోడ్లు, ఎక్స్ప్రెస్ వే వంటి కారిడార్లను ప్రకటించారని ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి అన్నారు.
పేద, మధ్య తరగతి బడ్జెట్..
నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేద, మధ్య తరగతి కుటుంబీకుల ఆశలను ప్రతిఫలింపజేసిందని వారు అన్నారు. ఎస్సీలు, బలహీనవర్గాల అభ్యున్నతికి 2020-21 సంవత్సరంలో 85 వేల కోట్ల రూపాయలు, ఎస్టీల అభ్యున్నతి కోసం 53,700 కోట్ల రూపాయలను కేటాయించడం అభినందనీయమని అన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి వుందనడానికి ఈ కేటాయింపులే నిదర్శనమని చెప్పారు. వేతన జీవులకు భారీగా ఊరట కల్పించిందని అన్నారు.












Click it and Unblock the Notifications