ఎగ్జిట్ పోల్స్ శుద్ద అబద్ధం : బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకే సంచలనం
చెన్నై : ఎగ్జిట్ పోల్స్ ప్రధాన రాజకీయ పార్టీల్లో కాకరేపుతున్నాయి. వార్ వన్ సైడ్ అన్నట్టు ఎన్డీఏ కూటమి విజయఢంకా మోగిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో విజయంపై బీజేపీ ధీమాతో ఉంటే .. ఎగ్జిట్ పోల్స్ తప్పని విపక్ష యూపీఏ కూటమి అంటుంది. ఈ క్రమంలో బీజేపీ భాగస్వామ్య పక్షం అన్నాడీఎంకే స్వరం కూడా మారింది. బీజేపీకి మెజార్టీ సీట్లు సాధించడం అనేది అబద్ధమని అంటున్నారు అన్నాడీఎంకే నేత, సీఎం పళనిస్వామి.
అదంతా ఫేక్ ..
దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తోందని లెక్కట్టాయి. ఎన్డీఏకు 302 సీట్లు, యూపీఏకు 122 సీట్లు, 118 ఇతరులు గెలుచుకుంటారని అంచనా వేశాయి. ఈ అంచనాలను బీజేపీ నేతలు సంబరపడిపోతున్నారు. అయితే బీజేపీ భాగస్వామ్య పక్షం అన్నాడీఎంకే మాత్రం ఎన్డీఏ అన్ని సీట్లు సాధించదని .. అదంతా అబ్ధమని తేల్చిచెప్పింది. తమిళనాడులో యూపీఏకు ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సీఎం పళనిస్వామి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో డీఎంకే 27 నుంచి 38 సీట్లలో పాగా వేస్తోందని పోల్స్ సర్వేలో బహిర్గతం చేశాయి. అయితే అన్నాడీఎంకే మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అయినప్పటికీ ఆ అంచనాలను పళనిస్వామి తప్పుపట్టారు. తమిళనాడు, పుదుచ్చేరిలో కలిపి అన్నాడీఎంకే 37 ఎంపీ సీట్లలో జయకేతనం ఎగురవేస్తుందని పేర్కొన్నారు. తమ ఓటు షేర్ 45 శాతం ఉంటుందని .. పోల్స్ అంచనాలు తారుమారవుతాయని తెలిపారు.

అబద్దపు లెక్కలే ..
2014 సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నేతృత్వంలో పార్టీ 37 సీట్లు గెలుచుకొంది. అప్పుడు అంచనాలు అన్నీ తారుమారయ్యాయని పేర్కొన్నారు. జయలలిత చరిష్మా మీద, ఆమె ప్రభావంతో అప్పుడు సీట్లు గెలుచుకుందని వివరించారు. అయితే ఆమె చనిపోయిన తర్వాత పార్టీలో లుకలుకలు మొదలై .. బలహీనమైన సంగతి తెలిసిందే. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ఒక వర్గం కాగా ... జయలలిత నెచ్చెలి శశికళ, టీటీవీ దినకరన్ మరో వర్గంగా పార్టీలో ఉంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎగ్జిట్ పోల్స్ ను టీటీవీ దినకరన్ తప్పుపట్టారు. తమ సొంత మీడియాతో బీజేపీ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిందని ఆయన ఆరోపించారు. ఇదంతా కల్పితమని, అబద్ధపు లెక్కలను వివరించారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications