దీదీ తరిమేస్తే బెంగాల్ విపక్ష నేతయ్యాడు..! మమతే బాస్ అంటున్నాడు..!
పశ్చిమబెంగాల్లో గత అసెంబ్లీలో ఓటమి పాలైన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అన్నీ షాకులే. ఎన్నికల ఫలితాలు కూడా వెలువడకముందే బీజేపీ మొదలుపెట్టిన దాడులతో సొంత పార్టీ కకావికలం అయిపోయి, ఎంపీలు, ఎమ్మెల్యేలు గోడ దూకేస్తున్న వేళ.. ఆమెకు ఇవాళ మరో షాక్ ఎదురైంది. తాను ఎంపిక చేసిన విపక్ష నేతను వ్యతిరేకిస్తూ 59 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి దగ్గరైన రెబెల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని (ritabrata Banerjee).. ఇవాళ ప్రభుత్వం విపక్ష నేతగా గుర్తించింది.
తాజా ఎన్నికల్లో 80 సీట్లు సాధించిన టీఎంసీ తరఫున విపక్ష నేతగా శోభన్ దేబ్ ఛటర్జీని మమత ఎంపిక చేశారు. ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యేల సంతకాలు కూడా తీసుకున్నారు. సంతకం పెట్టేందుకు అంగీకరించని ఇద్దరు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసి మరీ స్పీకర్ కు పంపేశారు. దీంతో ఆ ఇద్దరిలో ఒకరైన రితబ్రత బెనర్జీ తిరుగుబాటు ప్రారంభించారు. ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా, మిగతా ఎమ్మెల్యేలను కూడా దువ్వారు. చివరికి 59 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విపక్ష నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీయే తమ బాస్ అని అతిపెద్ద ట్విస్ట్ ఇచ్చారు.

మమతా బెనర్జీయే తమ నాయకురాలని, పార్టీని చీల్చే ఉద్దేశం తనకు లేదని రితబ్రత స్పష్టం చేశారు. 2018లో తృణమూల్లో చేరిన ఈ మాజీ వామపక్ష నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి ఛాంబర్ తాళాలు ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందిన తర్వాత రితబ్రత.. తామే ప్రధాన ప్రతిపక్షమని, తాము ఒక జట్టుగా పోరాడామని తెలిపారు. అంతకు ముందు తమ వర్గాన్ని టీఎంసీ "అసలైన" శాసనసభాపక్షంగా గుర్తించాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications