మహిళా ప్రయాణికురాలి వద్ద భారీగా పేలుడు పదార్థాలు: రైల్వే స్టేషన్లో అరెస్ట్
కోజికోడ్: కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్లో ఓ మహిళా ప్యాసింజెర్ నుంచి భారీగా పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ రైలు ప్రయాణికురాలి నుంచి పోలీసులు 117 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై-మంగుళూరు సూపర్ఫాస్ట్ రైలులో వచ్చిన సదరు ప్రయాణికురాలి నుంచి ఈ పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చెన్నైకు చెందిన ఆ మహిళను కస్టడీలోకి తీసుకున్నారు.
నిందిత మహిళ కూర్చున్న సీటు కింద పేలుడు పదార్ధులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, చెన్నై నుంచి కేరళలోని తలసరేకు వెళ్తోందామె. ఆ పేలుడు పదార్ధాలతో ఆమే ఏం చేయబోతోంది.. ఆమెకు వాటితో సంబంధం ఉందా? అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటి నుంచే గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. తనిఖీలు చేపడుతూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.