నీచమైన పాక్: నా రక్తం మరిగిపోతుంది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: నీచమైన పాకిస్థాన్ మాట్లాడుతున్న మాటలు విటుంటే, పాక్ చేస్తున్న అబద్దాలు చూస్తుంటే నారక్తం మరిగిపోతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
పాకిస్థాన్ ఇంతటి నీచానికి దిగజారుతుందని తాను ఊహించలేదనని ఆయన చెప్పారు. అసలు తమ భూభాగం (అక్రమిక పాకిస్థాన్)లో ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ దాడులు జరగలేదని పాక్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
చివరికి పాకిస్థాన్ అసత్యాలు ప్రచారం చేస్తూ అంతర్జాతీయ మీడియాను సైతం తప్పుదోవ పట్టిస్తుందని ఆయన ఆరోపించారు. పాక్ ను చూస్తుంటే పట్టరాని కోపం వస్తుందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే సర్జికల్ స్ట్రైక్ దాడుల పుటేజీ విడుదల చెయ్యాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
భారత సైనికులు పాక్ అక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఏడు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశారని, ఆ దాడులకు సంబంధించి పుటేజీ విడుదల చేస్తే పాక్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టినట్లు అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
నాకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో కొన్ని అభిప్రాయ విభేదాలు ఉండొచ్చు, అయితే పాకిస్థాన్ విషయంలో నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓవీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు.
అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ స్పందిస్తూ పాకిస్థాన్ కు ఎలా బుద్ది చెప్పాలో ప్రధాని నరేంద్ర మోడీకి బాగా తెలుసని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీని డెంగ్యూ, చికెన్ గునియా రహిత నగరంగా ఎలా మార్చాలో అని ఆలోచించాలని, ఇలాంటి విషయం కాదని ఆర్పీ సింగ్ సీఎం కేజ్రీవాల్ కు సలహా ఇచ్చారు.