దుస్తులు మార్చుకునే గదిలో కెమెరా: సాక్షిగా స్మృతి ఇరానీ!
పనాజీ: గోవాలోని ఫ్యాబ్ ఇండియా దుస్తుల షోరూంలో చేంజింగ్ రూంలో సీసీ కెమెరా కేసులో స్మృతి ఇరానీని కూడా సాక్షుల జాబితాలో చేర్చే అవకాశముంది. ఈ విషయాన్ని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు గురువారం నాడు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరో ఎమ్మెల్యే ప్రకాశ్ సావంత్ ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యే సదానంద్ తనవడేను కూడా ఈ కేసులో సాక్షులుగా చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
కాగా, ఈ కేసులో నిందితుడిని గోవా పోలీసులు ఇటీవల గుర్తించిన విషయం తెలిసిందే. గోవాలోని ఓ ఫ్యాబ్ ఇండియా షోరూంకు వెళ్లిన స్మృతి ఇరానీకి ట్రయల్ రూం సమీపంలో సీసీ కెమెరా కనిపించగా, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు చేధించారు.
దుకాణం రహస్య కెమెరా ఉదంతానికి కారకుడైన వ్యక్తిని గుర్తించినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. ఇక్కడి కండోలిమ్ గ్రామంలోని ఫ్యాబ్ ఇండియా దుకాణంలో దుస్తులు మార్చుకునే గది కనిపించే విధంగా కెమెరా దిశను మార్చడంలో అక్కడే పని చేసే ఒక ఉద్యోగి హస్తం ఉన్నట్లుగా తేలింది.
ఈ కేసుకు వెంటనే అదుపులోకి తీసుకున్న అయిదుగురిలో సదరు ఉద్యోగి కూడా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు. మంత్రి స్మృతి ఇరానీ ఫిర్యాదు చేసిన వెంటనే అక్కడే ఉన్న నిందితుడు హడావుడిగా ఆ కెమెరా దిశను మారుస్తున్న దృశ్యాన్ని మరో సీసీటీవీ కెమెరా రికార్డు చేసిందన్నారు.
దీంతోపాటూ నిందితుడిగా భావిస్తున్న ఉద్యోగికి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు సైతం లభించాయన్నారు. అతడితో సహా మరికొందరు కూడా ఈ నేరంలో భాగస్వాములై ఉండవచ్చన్నది పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీని కూడా సాక్షిగా చేర్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.