కాంగ్రెస్ అధ్యక్షురాలిగానే సోనియా గాంధీ: రాజీనామా ప్రతిపాదన తిరస్కరణ, సీడబ్ల్యూసీలో చర్చ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన పార్టీ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది. దాదాపు ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కీలకం అంశాలపై చర్చించారు. అలాగే సోనియా గాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని, గాంధీలపై నమ్మకం ఉందని సీనియర్ నేతలు కొందరు స్పష్టం చేశారు.
మళ్లీ పుంజుకుంటామంటూ సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ నేతలు
కాగా, ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. పార్టీ అధ్యక్ష ఎన్నిక గురించి కూడా చర్చకు వచ్చింది. కాగా, సోనియా గాంధీ వైపే మరోసారి కమిటీ ఓటేసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగనున్నట్లు సమావేశం అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సమావేశంలో ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే చర్చించినట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైందని సమావేశం అభిప్రాయపడిందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. లోపాలను సరిదిద్దుకుని పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
మళ్లీ సోనియానే.. సీడబ్ల్యూసీ సమావేశానికి అసమ్మతి నేతలు
కాంగ్రెస్ పార్టీని అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందుండి నడిపించాలని కమిటీ నిర్ణయించినట్లు వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పోటీకి పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఈ సమావేశానికి అసమ్మతి నేతలు కూడా హాజరయ్యారు. ఈ సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, మల్లిఖార్జున ఖర్గే, పీ చిదంబరం హాజరయ్యారు. ఇక అసమ్మతి నేతలు గులాంనబీ ఆజాద్, మనీశ్ తివారీ, ఆనంద్ శర్మ వంటి నేతలు కూడా హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గైర్హాజరయ్యారు. కరోనా పాజిటివ్ రావడంతో మాజీ రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఈ భేటీకి దూరంగా ఉన్నారు. మరో ముగ్గురు సీనియర్ నేతలు కూడా సమావేశానికి హాజరుకాలేదు.
Recommended Video
సీడబ్ల్యూసీలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ తాము రాజీనామాకు సిద్ధమన్న సోనియా గాంధీ ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించింది. కాగా, ఈ సమావేశంలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం గాంధీ కుటుంబం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అని ప్రకటించారు.. వ్యక్తుల కన్నా పార్టీయే ముఖ్యమని స్పష్టం చేసిన ఆమె.. గాంధీ కుటుంబం వల్లే పార్టీ బలహీన పడిందని భావిస్తున్నారు.. కొందరు నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నారు. సీడబ్ల్యూసీ సమావేశం కోరితే.. తాము రాజీనామా చేసేందుకు సిద్ధమని తెలిపారు సోనియా గాంధీ. అయితే, సోనియా గాంధీయే పార్టీ చీఫ్గా కొనసాగుతారని ఇవాళ జరిగిన కీలక సమావేశం తేల్చేసింది. సోనియా నాయకత్వంపై తమ అందరికీ నమ్మకం ఉందని పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఫలితాలను చవిచూసిన విషయం తెలిసిందే.