కాంగ్రెస్, జెడి(ఎస్) మధ్య లుకలుకలు: అవన్నీ తప్పుడు వార్తలే: కుమారస్వామి
న్యూఢిల్లీ:కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ చీప్ రాహుల్ గాంధీతో పాటు, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీతో చర్చలు జరిపేందుకు సోమవారం ఉదయమే జెడి(ఎస్) అధినేత కుమార స్వామి ఢిల్లీ చేరుకొన్నారు. అయితే జెడి(ఎస్)కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం నేతలు అయిష్టతతో ఉన్నారని వస్తున్న వార్తలను కుమారస్వామి ఖండించారు. ఇవన్నీ తప్పుడు వార్లలు అంటూ ఆయన కొట్టిపారేశారు.
కాంగ్రెస్, జెడి(ఎస్) ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఆ రెండు పార్టీల్లో అసమ్మతి వార్తలు ఈ రెండు పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం జేడీఎస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై విముఖంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
ముఖ్యమంత్రి పదవి పంపకం గురించి ముందే పట్టుబట్టాలని ఆ వర్గం కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే సీఎం పదవిని రెండు పార్టీలు పంచుకోవడంపై జెడి(ఎస్) నాయకత్వం సిద్దంగా లేదు. అయితే కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమిలో చిచ్చు రేగుతోందని వస్తున్న వార్తలపై జెడి(ఎస్) చీఫ్ కుమారస్వామి మండిపడ్డారు. ఈ కథనాలను కొట్టిపారేశారు. కాంగ్రెస్లో అసమ్మతి నిజమా? అని విలేకరులు ప్రశ్నిస్తే మీకు ఎవరు చెప్పారు? ఆ కథనాలన్నీ బోగస్ న్యూస్, అందులో నిజం లేదని అని కుమారస్వామి కుండబద్దలు కొట్టారు.
ప్రజల ఓటుతో తాను సీఎం కావాలనుకున్నానని, కానీ కాంగ్రెస్ మద్దతుతో సీఎం అవుతున్నానని కుమారస్వామి అన్నారు. ప్రజలు తనకు సొంతంగా మెజారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలని తాను కాంగ్రెస్ పార్టీని అడగలేదని, కాంగ్రెస్ వాళ్లే సీఎంగా ఉండమని తనను అడిగారని చెప్పారు. సీఎం పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనను నాన్న దేవెగౌడ అంగీకరించారని తెలిపారు. తన బలపరీక్షకు బీజేపీ ఇబ్బందిపెట్టినా.. తాను గెలిచి తీరుతానని అన్నారు.