బిర్యానీ తినడానికి వెళ్తే.. ప్రాణాలే పోయాయి..
చెట్టు కొమ్మలన్ని బిర్యానీ షాపుపై ఒరిగాయి. ఆపై.. అప్పటికే స్వల్పంగా ధ్వంసమై ఉన్న గోడ కాస్త... బిర్యానీ తింటున్న బాలుడితో పాటు పలువురిపై కూలిపోయింది.
న్యూఢిల్లీ : బిర్యానీ తినడానికి వెళ్లిన ఓ బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలే కోల్పోయాడు. కార్పోరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ నిండు ప్రాణం బలైపోయింది. ఈ దుర్ఘటనలో మరో ఏడుగురు గాయపడగా.. అందులో ఇద్దరు చిన్నారులే కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడు స్నేహితులతో కలిసి జందేవాలన్ సమీపంలో ఉన్న ఫైజ్ రోడ్డులోని ఎంసీడీ కాంప్లెక్స్ లో బిర్యానీ తినడానికి వెళ్లాడు. అదే సమయంలో.. బిర్యానీ షాపును ఆనుకుని ఉన్న ఎంసీడీ కాంప్లెక్స్ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులకు అడ్డుగా ఉన్న ఓ చెట్టును తొలగించడానికి ప్రయత్నించారు అధికారులు.
దీంతో చెట్టు కొమ్మలన్ని బిర్యానీ షాపుపై ఒరిగాయి. ఆపై.. అప్పటికే స్వల్పంగా ధ్వంసమై ఉన్న గోడ కాస్త... బిర్యానీ తింటున్న బాలుడితో పాటు పలువురిపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో బాలుడు అక్కడిక్కడే చనిపోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. బాధాకరమైన విషయమేంటంటే.. చనిపోయిన బాలుడి తండ్రి కూడా ఆ గోడ నిర్మాణం కోసం వచ్చిన కూలీల్లో ఉన్నాడు. కొడుకు చావును జీర్ణించుకోలేక ఆ తండ్రి గుండెలవిసేలా రోధించాడు.
కాగా, రోడ్ల పక్కన అక్రమంగా వెలిసిన షాపుల్లో ఈ బిర్యానీ షాపు ఒకటని కార్పోరేషన్ అధికారులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే.. ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే.. చెట్టును తొలగించేప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్పోరేషన్ సిబ్బంధిపై కూడా వేటు తప్పదని అంటున్నారు అధికారులు.