నేను ముస్లీంను ప్రేమించాను: సోషల్ మీడియాలో షేర్, యువతి ఆత్మహత్య, బీజేపీ నేత !
Recommended Video
బెంగళూరు: బీజేపీ నాయకులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు సమీపంలోని మూడిగెరె ప్రాంతంలో జరిగింది. పీయుసీ (ఇంటర్) చదువుతున్న ధన్యశ్రీ (20) అనే యువతి తాను ముస్లీం యువకుడిని ప్రేమిస్తున్నానని బీజేపీ నాయకులు వేధించారని, తన వ్యక్తిగత విషయాలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారని, జీవితంపై విరక్తిచెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని డెత్ నోట్ రాసి పెట్టిందని చిక్కమగళూరు జిల్లా ఎస్పీ అన్నామలై మీడియాకు చెప్పారు.
ముస్లీంను ప్రేమించడం పాపమా ?
నేను ఒక ముస్లీం యువకుడిని ప్రేమించడం పాపమా ? అంటూ ధన్యశ్రీ తన స్నేహితుడైన సంతోష్ అనే వ్యక్తికి సోషల్ మీడియాలో చాట్ చేసింది. ధన్యశ్రీ, సంతోష్ సోషల్ మీడియాలో చాటింగ్ చేసిన ప్రైవేట్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బజరంగ్ ధళ్ నాయకుడు !
ధన్యశ్రీ స్నేహితుడు సంతోష్ బజరంగ్ ధళ్ నాయకుడు. ధన్యశ్రీ సోషల్ మీడియాలో చాటింగ్ చేసిన విషయాలను సంతోష్ సోషల్ మీడియాలో అందరికీ షేర్ చేశాడు. లవ్ జీహాద్ ఉచ్చులో పడకూడదని సంతోష్ ధన్యశ్రీకి గట్టిగా హెచ్చరించాడు. హిందువులతో స్నేహంగా ఉండాలని, వారినే పెళ్లి చేసుకోవాలని ధన్యశ్రీకి సంతోష్ వార్నింగ్ ఇచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
ఇంటికి వెళ్లి వార్నింగ్
మూడగిరె పట్టణం బీజేపీ యువమోర్చ అధ్యక్షుడు అనీల్ రాజ్ తో పాటు ఐదు మంది ధన్యశ్రీ ఇంటికి వెళ్లారు. ముస్లీం యువకుడితో నీకు ఎందుకు స్నేహం , ప్రేమ అంటూ ధన్యశ్రీని ప్రశ్నించారు. ముస్లీం యువకులతో మాట్లాడకూడదని, హిందువులతో స్నేహంగా ఉండాలని ధన్యశ్రీతో పాటు ఆమె తల్లిని బెదిరించారు. లవ్ జీహాద్ ఉచ్చులో పడకూడదని ధన్యశ్రీకి వార్నింగ్ ఇచ్చారని సమాచారం.
ఆత్మహత్య
బీజేపీ నాయకులు ఇంటికి వచ్చి బెదిరించారని, తన వ్యక్తిగత విషయాలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారని, మానసికంగా వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ ధన్యశ్రీ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చిక్కమగళూరు జిల్లా ఎస్పీ అన్నామలై మీడియాకు చెప్పారు. ఆత్మహత్య చేసుకోకముందు ధన్యశ్రీ డెత్ నోట్ రాసిపెట్టిందని అన్నామలై అన్నారు.
బీజేపీ నాయకుడు అరెస్టు
ధన్యశ్రీ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఐదు మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడిగెరె పట్టణ బీజేపీ యువమోర్చ అధ్యక్షుడు అనీల్ రాజ్ ను అరెస్టు చేశామని చిక్కమగళూరు జిల్లా ఎస్పీ అన్నామలై మీడియాకు చెప్పారు. ధన్యశ్రీ మొబైల్ నుంచి చేసిన మెసేజ్ లు, ఫేస్ బుక్ వివరాల స్క్రీన్ షాట్ లు సోషల్ మీడియాలో షేర్ చేసిన వారి కోసం గాలిస్తున్నామని, ఈ కేసులో ఎవ్వరినీ వదిలిపెట్టమని ఎస్పీ అన్నామలై అన్నారు.