అద్భుతం.. మాజీ మంత్రిని పట్టుకోలేకపోయారు: పోలీసులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
పాట్నా/న్యూఢిల్లీ: బీహార్ మాజీ మంత్రి మంజు వర్మను అరెస్టు చేయనందుకు రాష్ట్ర డీజీపీకి సుప్రీం కోర్టు నోటుసులు ఇచ్చింది. పోలీసులు ఆమెను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది.
ముజఫర్ నగర్ బాలిక వసతి గృహాల అత్యాచార కేసుకు సంబంధించి మంజును పట్టుకోకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు విఫలం కావడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.
అద్భుతం..మాజీ మంత్రి మంజు వర్మ ఇంకా పరారీలో ఉన్నారు, అద్భుతం.. కేబినెట్లో మంత్రిగా పని చేసిన ఆమె ఇప్పటి వరకు ఎక్కఢ ఉన్నారనే విషయం ఎవరికీ తెలియదు, మాజీ మంత్రి ఆచూకీ తెలియకపోవడం ఎంత సీరియస్ విషయమో గ్రహించాలని న్యాయస్థానం పేర్కొంది.
నెల రోజులుగా ఆమె కోసం గాలిస్తున్నప్పటికి ఇప్పటి వరకు బీహార్ పోలీసులు ఆమెను పట్టుకోకపోవడం ఆశ్చర్యం వేస్తోందని పేర్కొంది. అనంతరం కేసు తదుపరి విచారణను నవంబర్ 27వ తేదీకి వాయిదా వేశారు.
కాగా, ముజఫర్ నగర్ హాస్టల్లో 40 మంది బాలికలపై దారుణంగా అత్యాచారం జరిగింది. ఈ కేసు సంచలనం సృష్టించింది. కేసులో ప్రధాన నిందితుడు ఉన్న హాస్టల్ ఓనర్ బ్రజేష్ను జైలుకు తరలించారు. ఈ కేసుతో ఠాకూర్ స్నేహితుడు, బీహార్ మంత్రి మంజు వర్మ భర్తకు కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో మంజు వర్మ రాజీనామా చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా మంజు వర్మ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆమె ఇంట్లో 50 ఆయుధాలు లభించాయి. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు.