మమతకు మద్దతుగా రైతు నేత రాకేష్ తికాయత్-నందిగ్రామ్లో మహాపంచాయతీకి రెడీ
పశ్చిమబెంగాల్ ఎన్నికల పోరు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని ఈసారి ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్న బీజేపీ అక్కడ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అదే సమయంలో మమత కూడా కౌంటర్ పౌలిటిక్స్తో బీజేపీని చికాకు పెడుతున్నారు. ఇదే క్రమంలో మమత పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో ఆమెకు మద్దతుగా రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ మహాపంచాయతీకి సిద్ధమయ్యారు.
ఢిల్లీలో రైతు ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేస్తున్నారు. ఇదే క్రమంలో రైతు ఆందోళనల్ని నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడించేందుకు ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా పశ్చిమబెంగాల్లో మమతకు మద్దతుగా మహాపంచాయతీ నిర్వహించేందుకు తికాయత్ సిద్ధమయ్యారు. ఇవాళ కోల్కతా చేరుకున్న ఆయనకు తృణమూల్ ఎంపీ డోలా సేన్ స్వాగతం పలికారు.
ఇప్పటికే నందిగ్రామ్ చేరుకున్న రాకేశ్ తికాయత్ రేపు, ఎల్లుండిలో మహా పంచాయతీ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ బిల్లులతో రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీని ఓడించాలని ఆయన మహాపంచాయతీలో ప్రజలకు పిలుపు ఇవ్వనున్నారు. ఢిల్లీ రైతు ఆందోళనల్లో అన్నదాతల్ని ఏకతాటిపైకి తెచ్చిన తికాయత్ రాకతో నందిగ్రామ్లో తృణమూల్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఆయన మహాపంచాయతీని విజయవంతం చేసేందుకు తృణమూల్ సహకారం అందిస్తోంది. అయితే తికాయత్ మహా పంచాయతీ ఎన్నికల్లో మమతకు ఏ మేరకు పనికొస్తుందో చూడాలి.