40 రోజుల్లో 60 మంది రైతులు బలి -కేంద్రం దిగిరావాల్సిందే -నేతల డిమాండ్ -7వ రౌండ్ చర్చలు షురూ
వ్యవసాయ రంగంలో అద్భుత సంస్కరణలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు సోమవారంతో 40వ రోజుకు చేరాయి. రైతులు నిరసనలు చేస్తోన్న ఢిల్లీలో భయానక చలికితోడు భారీ వర్ష సూచనలు జారీ కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది. సమస్యల పరిష్కారం దిశగా రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరు దఫాలుగా చర్చలు జరిపినా సానుకూల ఫలితాలు రాలేదు. సోమవారం 7వ రౌండ్ చర్చలు ప్రారంభమయ్యాయి.
Recommended Video
ఏపీలో బండి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్? -ఢిల్లీలో సోము వీర్రాజు, సంజయ్ -నడ్డాతో కీలక భేటీ -వ్యూహాత్మకంగా
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా రైతు సంఘాల నేతలు, కేంద్ర మంత్రుల మధ్య ఏడో రౌండ్ చర్చలు మొదలయ్యాయి. డిమాండ్ల విషయంలో గతంలో కంటే మరింత పట్టుబిగించిన రైతులు.. ఇవాళ్టి చర్చలుగానీ ఎలాంటి ఫలితం లేకుండా ముగిస్తే గనుక రేపటి నుంచి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామమని రైతులు ఉద్యమకార్యాచరణ కూడా ప్రకటించడం తెలిసిందే. మంత్రులతో చర్చల కోసం లోనికి వెళ్లేముదు వివిధ రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు..
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల నిరసనలు ప్రారంభమై 40 రోజులు కాగా, ఇప్పటివ వరకు మొత్తం 60 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ప్రతినిధి రాకేష్ తికాయత్ సోమవారం ఆవేదనగా చెప్పారు. రైతుల నిరసనల్లో ప్రతీ 16 గంటలకు ఒక రైతు మరణించారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఢిల్లీలో చలి గాలులు వీస్తున్నా రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారని చెప్పారు..
తమ డిమాండ్లలో ఎలాంటి మార్పులేదని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయడం తోపాటు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం ప్రకటించాలని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా కేంద్రం దిగిరావాలని, అలా జరగని పక్షంలో నిరసనల్ని ఉధృతం చేస్తామన్నారు.
ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 6న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 13న సాగు చట్టాల ప్రతులను దహనం, జనవరి 23న నేతాజీ జయంతిని పురస్కరించుకుని ఆజాద్ హింద్ కిసాన్ దివస్, గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలోని రాజ్పథ్లో ట్రాక్టర్లతో గణతంత్ర పరేడ్, రైతు కవాతు నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం నాటి చర్చలు కీలకంగా మారయి.