ఢిల్లీ ముట్టడి: ఆ మార్గాల్లో ఉద్రిక్తత
Farmers' protest 2024: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరోసారి ఉత్తరాది రైతులు ఉద్యమించనున్నారు. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు.
2021లో రైతుల ఆందోళన రోజుల తరబడి సాగిన విషయం తెలిసిందే. దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన దీక్షలను కొనసాగించారు. ఏడాది కాలం పాటు వారంతా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలను కొనసాగించారు. ఇప్పుడు మరోసారి రోడ్డెక్కడానికి సిద్ధపడ్డారు. ఈ నెల 13వ తేదీన ఛలో ఢిల్లీ ఆందోళనకు పిలుపునిచ్చారు.

కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా.. వంటి 200లకు పైగా రైతు సంఘాలు ఈ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఛలో ఢిల్లీ ఆందోళనలో మూడు లక్షల మంది వరకు రైతులు పాల్గొనే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్.. వంటి రాష్ట్రాల నుంచి 500లకు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీకి తరలి వెళ్లనున్నారు రైతులు. దీనికోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పించడంతో పాటు గతంలో తాము ప్రతిపాదించిన తమ డిమాండ్లను పరిష్కరించాలని పట్టుబట్టుతున్నారు.

ఈ ర్యాలీని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపడుతున్నారు. హర్యానా, పంజాబ్ నుంచి ఢిల్లీలో ప్రవేశించే మార్గాలను మూసివేశారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి- ఘాజీపూర్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు. వాహనాలేవీ ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయడానికి సిమెంట్ దిమ్మెలనూ అందుబాటులో ఉంచారు.
ఈ మార్గం గుండా రాకపోకలను సాగించే వాహనాలను తనఖీ చేస్తోన్నారు పోలీసులు. పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం.. ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చింది. రైతుల డిమాండ్లను పరిష్కరించాలని, వాటిపై సానుకూలంగా స్పందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. ఓ ప్రకటన విడుదల చేశారు.












Click it and Unblock the Notifications