అమేథీలో చేదు అనుభవం: రాహుల్ ఇటలీకి వెళ్లిపో అంటూ రైతుల నినాదాలు
అమేథీ: సొంత నియోజకవర్గం అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. అమేథీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీని రైతులు అడ్డుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. అమేథి జిల్లాలోని గౌరీగంజ్ రైతులు రాహుల్ గాంధీని అడ్డుకున్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం ఇచ్చిన భూములు తిరిగి ఇవ్వాలని లేదా తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని రాహుల్ గాంధీని రైతులు డిమాండ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం అయిన నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో పర్యటించారు. గౌరీగంజ్లో ఆయన్ను రైతులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ ఇటలీకి వెళ్లిపోవాలన్నారు రైతులు. ఆయన వల్ల తమకు ఒరిగింది ఏమీ లేదని మండిపడ్డారు. రాహుల్ తమ భూమిని లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీ దగ్గర రైతులు నిరసన తెలిపారు. ఈ ఫ్యాక్టరీని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అమేథీ నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్న సమయంలో ప్రారంభించారు. 1980లో జైన్ బ్రదర్స్ 65.57 ఎకరాల భూమిని కౌసర్లోని పారిశ్రామికవాడలో సేకరించారు. అయితే ఫ్యాక్టరీని ప్రారంభించడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత ఈ భూమిని 2014లో వేలం వేశారు.
ఓటు హక్కు రద్దు..! జనాభా అదుపు కోసం బాబా రామ్ దేవ్ కొత్త సూత్రం..!
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ 1986లో 65.57 ఎకరాలను జైన్ బ్రదర్స్కు లీజుపై ఇచ్చింది. కంపెనీ ఏర్పాటు కాకపోవడంతో రుణాల రికవరీ ట్రైబ్యునల్ భూమిని 2014లో వేలం వేసి రూ.20.10 కోట్లు రికవర్ చేసింది. ఆనాడు వేలం పాటలో రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు ఈ భూమిని కొనుగోలు చేసింది. అయితే భూమిని వేలంపాటలో కొన్న విధానాన్ని తప్పుబడుతూ కోర్టు భూమిని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు అప్పజెప్పాలని ఆదేశించింది. ఇక అప్పటి నుంచి ఈ భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉంటే భూమిని రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు పేరుతో రాహుల్ గాంధీ భూమిని స్వాహా చేశారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇదిలా ఉంటే రైతు సంక్షేమమే తమ ధ్యేయమని కాంగ్రెస్ అధ్యక్షుడు చెబుతున్నారు. అంతేకాదు రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రసంగంలో పదేపదే చెబుతున్నారు. అయితే ఈ భూములపై రాహుల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.