పెళ్లిళ్లు: కలిసి చోరీలు చేస్తున్న తండ్రి, కొడుకు
తిరుపతి: కుమార్తెల పెళ్లి కోసం తండ్రి చోరీలు చెయ్యడం మొదలు పెట్టాడు. తండ్రికి సహాయం చెయ్యడానికి అతని కుమారుడు రంగంలోకి దిగాడు. అంతే వరుసగా ఇళ్లు కోల్లగొట్టడం మొదలు పెట్టారు. తాళం వేసిన ఇండ్లు కనపడితే అంతే, ఆ ఇంటిలో నగలు, నగదు లూటీ చేస్తున్నారు.
అహమ్మద్ మియార్ (50), ఆయన కుమారుడు ఖాజ మొహినుద్దీన్ రియాజ్ అలియాస్ అస్లాం (27) అనే ఇద్దరిని అరెస్టు చేశామని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టి తెలిపారు. ఎస్పీ గోపినాథ్ జెట్టి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
అహమ్మద్ మియార్ చెన్నయ్ లోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్లకు అతని దగ్గర డబ్బులు లేవు. చోరీలు చెయ్యాలని నిర్ణయించాడు. తండ్రికి సహాయం చెయ్యాలని అతని కుమారుడు సల్మాన్ నిర్ణయించాడు.
ఇద్దరు కలిసి తిరుపతి చేరుకున్నారు. అనంతరం పలు ప్రాంతాలలో సంచరించి ఇండ్ల తాళాలు వేసి ఉన్న విషయం గుర్తించారు. గుట్టు చప్పుడు కాకుండ తాళాలు పగలగొట్టి బంగారు నగలు, నగదు, విలువైన వస్తువులు లూటీ చేసి చెన్నైలోని ఇంటికి తరలిస్తున్నారు.
ఈ విధంగా కుటుంబ సభ్యులను పోషిస్తూ, తండ్రి, కోడుకు జల్సాలు చేస్తున్నారు. తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని పరింగిపేటకు చెందిన అహమ్మద్ మియార్ చెన్నైలో సెటిల్ అయ్యాడు. తిరుపతితో పాటు చిత్తూరు, వేలూరుతో సహ పలు పట్టణాలలో వీరు చోరీలు చేశారు.
ఆదివారం సాయంత్రం తిరుపతిలోని లక్ష్మిపురం సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న సమయంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు విషయం వెలుగు చూసిందని ఎస్పీ గోపినాథ్ జెట్టి చెప్పారు.
చెన్నయ్ లోని వీరి ఇంటిలో దాచి పెట్టిన 828 గ్రాముల బంగారు నగలు, 1,600 కేజీల వెండి వస్తువులు స్వాదీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 21 లక్షలు ఉంటుందని గోపినాథ్ జెట్టి అన్నారు. వీరిద్దరు తిరుపతి, తిరుచానూరు సమీపంలో 18 ఇండ్లలో చోరీలు చేశారని, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు చోట్ల వీరి మీద కేసులు నమోదు అయ్యాయని ఎస్పీ గోపినాథ్ జెట్టి వివరించారు.