సునంద పుష్కర్ మృతి మిస్టరీ: ఎఫ్బిఐ కొత్త ట్విస్ట్
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి పైన తాజాగా మరో కోణం వెలుగు చూసింది. ఆమె ఆత్మహత్య అనంతరం ఎన్నో ట్విస్ట్లు జరిగాయి. తాజాగా కొత్తగా ఓ విషయం వెలుగు చూసింది.
సునంద పుష్కర్ మృతి పాయిజన్ వల్ల మృతి చెందినట్లుగా అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) నివేదికలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదిక గురువారం నాడు (జనవరి 21) వచ్చింది. అందులో... ఆమె పాయిజన్ వల్ల మృతి చెందినట్లుగా తేలిందని సమాచారం.
విషప్రయోగం వల్ల, ఓవర్ డోస్ వల్ల ఆమె మృతి చెందడానికి కారణాలు అని తేలినట్లుగా సమాచారం. 52 ఏళ్ల సునంద పుష్కర్ ఢిల్లీలో 2014లో ఓ హోటల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి సహజమైనది కాదని ఢిల్లీ పోలీసులు చెప్పారు.
ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బస్సీ మాట్లాడుతూ... సునంద మృతి సహజమైనది కాదని చెప్పారు. ఏఐఐఎంఎస్ ఫోరెన్సిక్ సైన్స్ డిపార్టుమెంట్ హెడ్ సుధీర్ గుప్తా మాట్లాడుతూ... ఎఫ్బిఐ నివేది కూడా ఆమె విషప్రయోగం వల్ల మృతి చెందిందని చెబుతోందన్నారు.