పోరాడితే పోయేదేమీ లేదు: మహారాజా కాలేజీ పూర్వ విద్యార్థులకు రఘురామ కృష్ణరాజు ఉద్భోద..
పోరాడితే పోయేదేమీ లేదు.. వీధుల్లోకి రండి అంటూ మహారాజా కాలేజీ పూర్వ విద్యార్థులకు వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పిలుపునిచ్చారు. మాన్సాస్ ట్రస్ట్ పేరుతో జరుగుతోన్న రాజకీయాలపై ఢిల్లీలో ఉండి స్పందించారు. ఇవాళ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం మహారాజా కాలేజీ ప్రైవేటీకరణ సరికాదన్నారు.

చారిత్రక నేపథ్యం గల విద్యాసంస్థ..
విజయనగరం మహారాజా కాలేజీ చారిత్రక నేపథ్యం ఉన్న విద్యాసంస్థ అని రఘురామ తెలిపారు. శతాబ్దం కింద ఎవరైనా చదువుకోవాలని అనుకుంటే విజయనగరం మహారాజా కాలేజీకి వచ్చేవారని గుర్తుచేశారు. అప్పట్లో విశాఖపట్టణంలో సరైన విద్యసదుపాయాలు లేవు అని చెప్పారు. కానీ మాన్సాస్ ట్రస్ట్, కాలేజీ పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పారు. కాలేజీని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని తెలిపారు.

వీవీ గిరి విచ్చేసి
1971లో కాలేజీ శత వసంతోత్సవం జరుపుకుందని రఘురామ గుర్తుచేశారు. రాష్ట్రపతి హోదాలో వీవీ గిరి కాలేజీకి వచ్చారని వెల్లడించారు. కానీ ఇప్పుడు మాత్రం కాలేజిని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దీనిపై కాలేజీ పూర్వ విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారని ప్రస్తావించారు. ఇళ్లల్లో కూర్చొని వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలతో సరిపెట్టకుండా, రోడ్లపైకి వచ్చి పోరాడాలని సూచించారు.

ప్రతీ ఇంటిలో ఒకరు
ఉత్తరాంధ్రలో ప్రతి ఇంటిలో ఒకరు కాలేజిలో చదువుకున్నారని తెలిపారు. మాన్సాస్ ట్రస్టులో గానీ, మహారాజా కళాశాలలో గానీ దాన్ని అన్ ఎయిడెడ్ చేయాలనో, ప్రైవేటీకరణ చేయాలనో ప్రయత్నాలు జరుగుతున్నాయని రఘురామ వివరించారు. మాన్సాస్ ట్రస్ట్లో ఎవరికైతే అర్హత ఉందో వారిని పునరుద్ధరించాలి అంటూ రోడ్డుమీదికి రండి అని కోరారు. ఇది విజయనగరం కళాశాల, సంగీత పాఠశాల అని వాట్సాప్లలో సందేశాలు మానుకోవాలని కోరారు.
Recommended Video

రాత్రికి రాత్రి ఎవరినో తీసుకొచ్చి
అర్ధరాత్రి ఎవరినో తీసుకొచ్చి ట్రస్టులో కూర్చోబెట్టారని రఘురామ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తప్పులను సవరించుకునే ఆలోచన లేదన్నారు. పరిస్థితిని మార్చాల్సింది విజయనగరం మహారాజా కాలేజీ పూర్వ విద్యార్థులేనని రఘురామ చెప్పారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలను, సింహాచలం దేవస్థానంలో జరిగే అన్యాయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications