అంతా సస్పెన్స్: సునంద మృతిపై సినిమా, మనీష నటిస్తున్నారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి మిస్టరీ కథాంశంగా ఓ సినిమా రావొచ్చుననే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను 'గేమ్'గా తెరకెక్కించనున్నారని అంటున్నారు.
ఆంగ్ల మీడియాలోని వార్తల ప్రకారం... దీనిపై కాంగ్రెస్ పార్టీ వర్రీ అవుతోందని తెలుస్తోంది. ఈ సినిమా విషయమై సినిమా తీయబోతున్న దర్శకుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మనీషా కోయిరాలా ప్రధాన పాత్రలో నటించవచ్చునని వార్తలు వస్తున్నాయి.
దర్శకుడు ఏఎంఆర్ రమేష్ అని తెలుస్తోంది. సాధారణంగా ఏఎంఆర్ రమేష్ నిజ జీవిత కథలతో సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు సునంద పుష్కర్ మృతి పైన ఆయన సినిమాను ప్లాన్ చేశారని అంటున్నారు.
ఈ సినిమా గురించి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆరా తీశారని దర్శకుడు రమేష్ కూడా చెప్పారని తెలుస్తోంది. అందులో తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత ఖుష్బూ కూడా ఉన్నారని అంటున్నారు. ఆమె కూడా ఈ సినిమా పైన ఆరా తీశారని తెలుస్తోంది. అయితే, ఈ సినిమా గురించిన రహస్యాన్ని చెప్పేందుకు దర్శకులు సిద్ధంగా లేరని అంటున్నారు.
దీనిపై ప్రముఖ నేత రామచంద్రప్ప మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు ఇది సాధారణమే అన్నారు. కమర్షియల్గా లబ్ధి పొందేందుకు వారు ఇలాంటి కథలను ఎంచుకుంటారని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతానికి ఆ సినిమా షూటింగ్ జరగడం లేదని, అప్పుడే దాని గురించి ఏం మాట్లాడలేమని చెప్పారు. కొద్ది రోజుల క్రితం రమేష్ మాట్లాడుతూ.. తన తదుపరి చిత్రం ఓ వీఐపీ మర్డర్ కోణంలో ఉంటుందని చెప్పారు. దీంతో సునంద మృతి పైన అతను సినిమా తీస్తున్నారనే ఊహాగానాలు వచ్చాయి.