అఫిషియల్ దోస్తీ: ఫడ్నవీస్ మంత్రివర్గంలోకి శివసేన
ముంబై: మహారాష్ట్రలో శివసేన, భారతీయ జనతా పార్టీల మధ్య దోస్తీ మళ్లీ కుదిరింది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. మహా ప్రభుత్వంలో శివసేన చేరనుంది. ఆ పార్టీకి 5 కేబినెట్, 7 సహాయ మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం చెప్పారు. 12 మంది శివసేన ఎమ్మెల్యేలు శుక్రవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఫడ్నవీస్ తెలిపారు.
దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గాన్ని రేపు ఎక్స్పాండ్ చేస్తున్నారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు విదర్భ భవన్లో జరగనుంది. ఫడ్నవీస్ రెండు రోజు క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను న్యూఢిల్లీలో కలిశారు. మంత్రివర్గ విస్తరణ, శివసేన అంశంపై చర్చించారు.
ప్రస్తుతం ఎనిమిది కేబినెట్ మంత్రులు, ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారు ఫడ్నవీస్తో పాటు అక్టోబర్ 31వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. శివసేనకు చెందిన 12 మందితో పాటు బీజేపీకి చెందిన 10 మందిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఉప ముఖ్యమంత్రి పోస్ట్ లేదు
గత కొంతకాలంగా శివసేన ఉప ముఖ్యమంత్రి పోస్టు కోసం పట్టుబడుతున్న విషయం తెలిసిందే. దీనిపై సేన తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఉండదని ఫడ్నవీస్ చెప్పారు. తాను శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో మాట్లాడానని, వారు పాజిటివ్గా ఉన్నారని చెప్పారు. బీజేపీ, శివసేనలు 25 ఏళ్లుగా మహారాష్ట్రలో కలిసి ఉన్నాయని ఫడ్నవీస్ గతంలో అన్నారు.