1700 కోట్ల కుంభకోణం: మాజీ కేంద్ర మంత్రి ప్రమేయం
న్యూఢిల్లీ: నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ (ఎన్టీసీ) కుంభకోణం కేసు దర్యాప్తు మరో కొత్త మలుపు తిరిగింది. నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్కు సంబంధించిన రూ. 1700 కోట్ల విలువైన భూముల అమ్మకాల్లో ఆనాటి కేంద్ర టెక్ట్స్టైల్స్ మంత్రి శంకర్ సింగ్ వాఘేలాతో పాటు ఎన్టీసీ మాజీ ఛైర్మన్ రామచంద్ర పిళ్లై హస్తం ఉన్నట్లు సీబీఐ నిర్ధారణకు వచ్చింది.
దీంతో బుధవారం వారిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉందని తెలియడంతో మంగళవారం న్టీసీ మాజీ చైర్మన్ రామంచంద్రన్ పిళ్లై నివాసం, కార్యాలయాల్లో జరిపిన తనిఖీలలో డాక్యుమెంట్లు, పలు ఆధారాలు లభ్యమయ్యాయని సీబీఐ పేర్కొంది.
తమకు దొరికిన ఆధారాలు పిళ్లైతోపాటు మాజీ మంత్రి వాఘేలా పాత్రలను నిర్ధారించేవిగా ఉన్నాయని సీబీఐ వర్గాలు తెలిపాయి. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా ఎన్టీసీకి చెందిన భూములను విక్రయించాలని ఛైర్మన్గా ఉన్న పిళ్లై నిర్ణయించారు.
ఈ భూములను తమకు చెందిన ప్రైవేటు కంపెనీలకు చెందిన వ్యక్తులకు కట్టబెట్టేందుకు మంత్రి వాఘేలా, పిళ్లైలు నిబంధనలను మార్చివేశారని వారిపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా లబించిన ఆధారాలతో చార్జిషీటు సమయంలో దాఖలు చేసిన ఆరోపణలు నిజమని తేలే అవకాశం ఉందని వివరించారు.