కాశ్మీర్లో ఆలం పాకిస్తాన్ జెండాల ఎగరవేత: ముఫ్తీపై బీజేపీ ఆగ్రహం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జాతీయ జెండాలను ఎగురవేసిన వేర్పాటువాది మస్రత్ ఆలంకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ జమ్మూలో ఆందోళన చేపట్టింది. ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ వేర్పాటువాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
యాసిన్ మాలిక్, మస్రత్ ఆలంలను అరెస్టు చేసి పాకిస్తాన్కు పంపించాలని వారు డిమాండ్ చేశారు. మస్రత్ ఆలంకు వ్యతిరేకంగా కర్నాటక రాజధాని బెంగళూరులోను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
శ్రీనగర్ పోలీస్ స్టేషన్లో మస్రత్ ఆలంపై కేసు నమోదయింది. అతనిని ఇంకా అరెస్టు చేయలేదు. మస్రత్ జైలు నుండి నెల రోజుల క్రితమే విడుదలయ్యాడు. అతను రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జెండాలతో ప్రదర్శన చేశాడు. వారు పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేశారు.
తాము మస్రత్ ఆలం పైన కేసు బుక్ చేశామని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినందుకు వారి పైన కేసులు పెట్టామని పోలీసులు తెలిపారు. అతనిని శిక్షిస్తామని చెప్పారు. అతనిని ఇంకా అరెస్టు చేయలేదు. ఆలంను నెల రోజుల క్రితం ముఫ్తీ ప్రభుత్వం విడుదల చేసింది. అప్పుడే బీజేపీ మండిపడింది.