బాబా రామ్దేవ్పై కేసు నమోదు: వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్
ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్పై కేసు నమోదైంది.
జైపూర్: ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్పై కేసు నమోదైంది. రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్లో జరిగిన ఓ కార్యక్రమంలో బాబా రామ్ దేవ్.. ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగం చేశారు. దీనిపై స్థానికంగా ఉండే పథాయ్ ఖాన్ చౌహతాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. రామ్దేవ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఐపీసీ సెక్షన్లు 153ఏ(మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాస స్థలం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295ఏ(మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యం, హానికరమైన చర్యలు), 298ఏ(మతపరమైన భావాలను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, ఫిబ్రవరి 2న బార్మర్లో ఓ సమావేశంలో ముస్లింలపై బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐదుసార్లు నమాజ్ చేస్తున్న ముస్లింలు హిందూ యువతులను అపహరిస్తున్నారని, ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇస్లాం, క్రిస్టియన్ మతాలవారు ఉద్దేశపూర్వకంగానే మతమార్పిడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
'నేను ఎవరినీ విమర్శించడం లేదు కానీ.. కొంతమంది ప్రపంచాన్ని ఇస్లాం.. క్రైస్తవ మతంలోకి మార్చడానికి నిమగ్నమై ఉన్నారు' అని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. ముస్లింలు నమాజ్ చేసి, క్రైస్తవులు చర్చిలో కొవ్వొత్తి వెలిగించి పాపాలు పోతాయని అనుకుంటున్నారని.. హిందూమతంలో ఇలాంటివేం లేదన్నారు. హిందూ మతం మంచి చేయాలని బోధిస్తుంటే.. ఈ రెండు మతాలు మత మార్పిడిలో నిమగ్నమై ఉన్నాయని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు.