60 ఏళ్ల వృద్దురాలిపై గ్యాంగ్ రేప్... చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి... నిందితుల్లో ఇద్దరు మైనర్లు...
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలిలో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్దురాలిపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. సింగ్రౌలి రైల్వే క్రాసింగ్ సమీపంలో ఆదివారం(ఆగస్టు 15) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆ మహిళ రైల్వే క్రాసింగ్ సమీపం నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న ఐదుగురు ఆమెను అడ్డగించారు. అనంతరం బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లారు. ఆపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఎలాగోలా ఆ మహిళ వారి చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.నిందితులు మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
వారం రోజుల క్రితం ఇదే మధ్యప్రదేశ్లో ఓ పనిమనిషిపై రిటైర్డ్ ప్రొఫెసర్,సెక్యూరిటీ ఏజెన్సీ యజమాని గ్యాంగ్ రేప్కు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఆమె స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలను అడ్డుపెట్టుకుని కొన్ని నెలలుగా ఆమెపై వారు లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చారు. విషయం బయటకు పొక్కితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె నోరు మూయించారు. బాధితురాలు ఎట్టకేలకు ధైర్యం చేసి ఇటీవల పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
ఇదే నెలలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో చోటు చేసుకున్న మరో ఘటనలో 50 ఏళ్ల ఓ మహిళ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారానికి గురైంది.ఆస్పత్రిలో పనిచేసే వార్డు బాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
గత నెలలో చోటు చేసుకున్న మరో ఘటనలో... అత్యాచారంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ మైనర్ బాలిక పోలీస్ స్టేషన్లోనే ప్రసవించింది.అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన ఆ బాలికకు పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలోనే పురిటి నొప్పులు వచ్చాయి. బాలిక అక్కడే ప్రసవించగా... అనంతరం తల్లీబిడ్డలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చింద్వారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గడిచిన నాలుగైదేళ్లలో మధ్యప్రదేశ్లో 26,708 రేప్ కేసులు,37 హత్యాచార కేసులు,27,827 మైనర్ బాలికల కిడ్నాప్ కేసులు,853 మహిళల కిడ్నాప్ కేసులు,2663 హత్య కేసులు నమోదైనట్లు క్రైమ్ డేటా చెబుతోంది. ఈ గణాంకాలను రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్వయంగా అసెంబ్లీలో వెల్లడించారు.