పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టిన భారత్: ఐదుగురు పాక్ రేజంర్స్ హతం..
తాజా దాడి ద్వారా కవ్వింపు చర్యలను ఏమాత్రం సహించేది లేదన్న సంకేతాలు భారత ఆర్మీ పంపించింది. మరోవైపు భారత్ కాల్పులపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తూ.. కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్ కు భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. సరిహద్దు వెంబడి పాక్ రేంజర్ల తీరు ఎంతకీ మారకపోతుండటంతో భారత్ ఎదురుదాడికి దిగింది. దీంతో జమ్ముకశ్మీర్లోని భింబర్, బట్టల్ సెక్టార్లలో భారత ఆర్మీ చేతిలో ఈ రోజు ఐదుగురు పాక్ రేంజర్లు హతమయ్యారు. మరో ఆరుగురు రేంజర్లు గాయాలపాలయ్యారు.
గురువారం ఉదయం కూడా పాక్ కవ్వింపు చర్యలకు దిగడంతో భారత ఆర్మీ ఏమాత్రం సహించలేదు. పాక్ శిబిరంపై కాల్పులు జరిపింది. కాగా, ఇటీవలే పాక్ శిబిరాలను భారత్ ధ్వంసం చేసినప్పటికీ పాక్ తన తీరు మార్చుకోకపోవడం గమనార్హం. ఇటీవలే పాక్ జరిపిన కాల్పుల్లో పలువురు కూలీలు సైతం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా దాడి ద్వారా కవ్వింపు చర్యలను ఏమాత్రం సహించేది లేదన్న సంకేతాలు భారత ఆర్మీ పంపించింది. మరోవైపు భారత్ కాల్పులపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్లోని భారత ఉప హైకమిషనర్ జేపీ సింగ్ ను పాకిస్థాన్ విదేశాంగ శాఖ పిలిపించుకుంది. ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన్ను కోరినట్లు తెలుస్తోంది. భారత దాడిని ఖండించిన పాక్.. ఇది అన్యాయమని పేర్కొంది.