Budget 2020: బడ్జెట్లయందు ఆ అయిదు బడ్జెట్లు వేరయా?: మోడర్న్ ఇండియాకు బాటలు..!
న్యూఢిల్లీ: బడ్జెట్. ఏటా ఫిబ్రవరిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని వర్గాల ప్రజల్లో ఆసక్తి ఉంటుంది. పారిశ్రామికవేత్తల నుంచి ఓ సాధారణ కార్మికుడి వరకు, ఓ ఉద్యోగి నుంచి ఓ గృహిణి వరకూ ప్రతి ఒక్కరికీ బడ్జెట్పై అంచనాలు ఏర్పడతాయి. కూడికలు, తీసివేతలు ఎలా ఉంటాయి? రూపాయి రాక, పోక ఎలా ఉంటుంది? ధరల పెరుగుదల ప్రభావం పడుతుందా? అనే చర్చ నడుస్తుంటుంది. నిత్యావసర సరుకుల ధరలు, గృహోపకరణాలు.. ఇవన్నీ సార్వత్రిక బడ్జెట్తో ముడిపడి ఉన్నవే.

దేశాన్ని కమ్ముకుంటోన్న బడ్జెట్ ఫీవర్..
ఇలా- ప్రతి వ్యక్తిపైనా ప్రభావాన్ని చూపే బడ్జెట్ ఫీవర్.. దేశవ్యాప్తంగా క్రమంగా అలముకుంటోంది. ఈ నెల 31వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఆ మరుసటి రోజే అంటే.. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెడతారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందుంచుతారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇదివరకే ఆరంభమైంది. బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పన ఎప్పట్లాగే గుట్టుగా సాగుతోంది.

కొన్ని మాత్రమే మైలురాళ్లుగా..
కాగా- కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రవేశ పెట్టే బడ్జెట్ ప్రతిపాదనలన్నీ దేశ భవిష్యత్తును మార్చకపోవచ్చు..లక్ష్యానికి అనుగుణంగా అంచనాలను అందుకోలేకపోవచ్చు. దేశ చరిత్రలో నిలిచిపోయేవిగా ఉండకపోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు జీవం పోయలేకపోవచ్చు. అందుకే- దేశ దశ, దిశలను మార్చే బడ్జెట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆధునిక భారతదేశ నిర్మాణానికి బాటలు వేశాయి. సరికొత్త భారతావని రూపకల్పనకు కేంద్రబిందువు అయ్యాయి. అవి ఇవే..

1950 ఫిబ్రవరి 28..
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత.. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 1950 ఫిబ్రవరి 28వ తేదీన మొట్టమొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు నాటి ఆర్థిక మంత్రి జాన్ మత్తయ్. ప్రణాళిక కమిషన్ కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది ఆ బడ్జెట్ ప్రతిపాదనల్లోనే. అదే ఏడాది మార్చి నాటికి ప్రణాళిక కమిషన్ ఏర్పాటైంది. ఈ తరువాత 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. నీతి ఆయోగ్ను తీసుకొచ్చింది. అది వేరే విషయం.

1968 ఫిబ్రవరి 29..
నాటి ఆర్థికశాఖ మంత్రి మొరార్జీ దేశాయ్ ఈ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలో 10 బడ్జెట్లను ప్రవేశపెట్టిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్పాదక రంగానికి ఊపిరి పోసిన బడ్జెట్గా దీన్ని అభివర్ణిస్తారు పారిశ్రామికవేత్తలు. అప్పటిదాకా ఉత్పాదక రంగానికి ఉన్న అడ్డంకులను తొలగించే దిశగా నాటి కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా- ఈ రంగం దూసుకెళ్లింది. దాదాపు అన్ని రంగాల్లోనూ ఉత్పత్తులు పెరగడం వల్ల జీడీపీ పురోగమించింది. కోట్లాది కుటుంబాలకు ఉపాధిని కల్పించినట్టయింది.

1986 ఫిబ్రవరి 28..
వీపీ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అది. పరోక్ష పన్నులకు బీజం పడింది అక్కడే. పన్నుల చెల్లింపులు, వసూళ్లు.. వంటి విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారాయన. ఫలితంగా- కేంద్ర ఖజానాకు రాబడి పెరిగింది. కొత్త మార్గాల్లో ఆదాయాన్ని సమకూర్చిపెట్టడానికి కేంద్రబిందువైంది. ప్రస్తుతం కొనసాగుతున్న జీఎస్టీ విధానానికి పునాది పడింది కూడా ఆ బడ్జెట్ ప్రతిపాదనల్లోనే. నాడు వీపీ సింగ్ ప్రవేశపెట్టిన పన్నుల మూల సూత్రాల మీదే జీఎస్టీ రూపుదిద్దుకుంది.

1991 జులై 24..
ఆధునిక భారతదేశ నిర్మాణానికి బాటలు వేసిన బడ్జెట్గా దీన్ని చెప్పుకోవచ్చు. నాటి ఆర్థికమంత్రి.. వరుసగా రెండు దఫాలుగా ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపట్టిన ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ అది. ఎగుమతులు, దిగుమతుల విధానంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. మానవీయ కోణంలో సంస్కరణలను చేపట్టడానికి కారణం అయ్యారు. ఎగ్జిట్ విధానంలో మార్పులు, చేర్పలు చేయడం వల్ల భారత్..తొలి పది ప్రపంచ దేశాల్లో ఒకటిగా నిలవగలిగింది.

1997 ఫిబ్రవరి 28..
దేశానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో కీలక పాత్ర పోషించిన బడ్జెట్ ఇది. బడా బాబుల నివాసాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికి తీయడానికి ఈ బడ్జెట్లో పొందుపరిచిన అంశాలను ఇప్పటికీ ఎవ్వరూ విస్మరించలేరు. ఆధునిక బారతావనిలో చరిత్ర సృష్టించినట్లుగా చెప్పుకొనే ఈ బడ్జెట్ను నాటి ఆర్థికమంత్రి పీ చిదంబరం ప్రవేశ పెట్టారు. చిదంబరం ప్రవేశపెట్టిన ప్రతిపాదనల వల్లే 1997-98 నుంచి 2010-11 మధ్యకాలానికి పన్నుల వసూళ్లు 18,700 కోట్ల రూపాయల నుంచి ఏకంగా లక్ష కోట్లకు చేరాయి.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications