పొంతన లేదు!: షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్ట్
ముంబై: షీనా బోరా హత్య కేసులో మరో మలుపు! తల్లి ఇంద్రాణి కూతురు షీనా బోరాను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు మొదటి నుంచి పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా సోమవారం నాడు మరో ట్విస్ట్ వెలుగు చూసింది.
2012లో అటవీ ప్రాంతంలో పెన్ స్టేషన్ పోలీసులు షీనా బోరాదిగా భావిస్తున్న బాగా కాలిపోయి ఉన్న మృతదేహం నుంచి సేకరించిన ఎముకల నమూనాలకు... ఇటీవల అదే చోటికి వెళ్లి మరోసారి తీసుకువచ్చిన నమూనాలకు ఎక్కడా పొంతన లేదని ఫొరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు.
అవి రెండూ సరిపోలడం లేదన్నారు. ఇక్కడి బీవైఎల్ నాయర్ హాస్పిటల్కు చెందిన ఫొరెన్సిక్ నిపుణులు ఈ మేరకు 26 పేజీల నివేదికను ఖర్ పోలీసు స్టేషన్కు ఇచ్చారు. షీనా బోరా హత్యకేసులో నిందితుల జ్యుడీషియల్ కస్టడీని సంబంధిత కోర్టు అక్టోబరు అయిదవ తేదీ వరకూ పొడిగించింది.
షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఒకప్పుడు ఆమె వద్ద డ్రైవరుగా పని చేసిన శ్యామ్ రాయ్లు ప్రస్తుతం వేర్వేరు జైళ్లలో ఉన్నారు. దాంతో, ముగ్గురు నిందితులనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు.