మోడీ తల్లి ఎప్పుడు ఎక్కువగా సంతోషించారంటే? కొడుకు నుంచి అలా హామీ తీసుకున్నారు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన కొడుకును చూసి బాగా సంతోషపడింది ఎప్పుడు అంటే.. ప్రధాని అయ్యాక అని చాలామంది భావిస్తారేమో. కానీ మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆమె ఎక్కువగా సంతోషపడిందట. ఈ మేరకు ఆయన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు రోజు తన తల్లితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.
తాను ప్రధానిగా అయినప్పటి కంటే గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే మా అమ్మ ఎక్కువగా సంతోషపడ్డారని చెప్పారు. గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ముందు తాను ఢిల్లీలో ఉండేవాడినని చెప్పారు. సీఎంగా పేరు ప్రకటించాక తాను తన తల్లిని కలిసేందుకు అహ్మదాబాద్ వెళ్లానని, అప్పటికే తాను ముఖ్యమంత్రిని అవుతున్నానన్న విషయం ఆమెకు తెలుసునని, ఇంటికి వెళ్లేసరికి అక్కడంతా సందడిగా ఉందన్నారు.
తనను చూడగానే తన తల్లి ఆనందంతో కౌగలించుకుని నువ్వు మళ్లీ గుజరాత్కు వచ్చేశావని, అదే నాకు గొప్ప అని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. పిల్లలు తన వద్ద ఉండాలని తల్లి మనసు ఎప్పుడూ కోరుకుంటుందని చెప్పారు. ఆ తర్వాత తన తల్లి తనకు ఓ చెప్పారని మోడీ అన్నారు.
నువ్వేం చేస్తావో నాకు తెలియదు.. కానీ జీవితంలో ఎప్పుడూ లంచం తీసుకోకు అని చెప్పిందని, అలా అని తనకు మాట ఇవ్వాలని చెప్పిందని, ఆ పాపం చేయవద్దని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఆ మాటలు నాపై ఎంతో ప్రభావం చూపాయన్నారు. ప్రధాని అయిన తర్వాత కూడా తాను ఆ విలువలను పాటిస్తున్నానని, ప్రధాని అయినా సీఎం అయినా దేశం పట్ల నిజాయతీగా ఉండాలనే తన తల్లి ఆకాంక్ష అన్నారు.