ఆ రాష్ట్రంలో ఫోర్డ్ మోటార్స్ భారీ పెట్టుబడులు: గ్రాండ్ రీఎంట్రీ
Ford India: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్ట్ మోటార్స్ కీలక ప్రకటన చేసింది. చెన్నైలో మూసివేసిన తన ఫ్యాక్టరీని పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. దాన్ని మరింత విస్తరించే దిశగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకున్నామనీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది.
2021లో ఇదే సెప్టెంబర్లో చెన్నైలో గల తన ప్లాంట్లను మూసివేసినట్లు ప్రకటించిందీ టాప్ కార్ మేకర్స్ కంపెనీ. అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టబోతోన్నట్లు అప్పట్లో ప్రకటించింది. 11.4 బిలియన్ డాలర్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ను తయారు చేసే యూనిట్లను నెలకొల్పబోతోన్నామని పేర్కొంది. దీనికి అదనంగా మరో రెండు బ్యాటరీ పార్కులను ఏర్పాటు చేయబోతోన్నట్లు ప్రకటించింది.

దీనికి అనుగుణంగా 2022 ఆగస్టులో చెన్నై- చెంగల్పట్టు మార్గంలోని మరైమళైనగర్లో గల కార్ల తయారీ యూనిట్ను మూసివేసింది కూడా. అదే సమయంలో అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ను నెలకొల్పింది. దీనివల్ల 11,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు ఫోర్డ్ తెలిపింది.
2030 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేసింది. 11.4 బిలియన్ డాలర్లతో టెన్నెస్సెలో కార్ల తయారీ యూనిట్లు, కెంటకీలో రెండు బ్యాటరీ తయారీ కేంద్రాలను నెలకొల్పుతామని పేర్కొంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీపై పెద్ద ఎత్తున దృష్టి సారించినందున చెన్నై, గుజరాత్లోని సమంద్లో గల కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను మూసివేసింది.
ఇప్పుడు మళ్లీ దీన్ని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు ఫోర్డ్ మోటార్స్ యాజమాన్యం తెలిపింది. దీన్ని ఎగుమతుల కోసం ఉపయోగించాలని నిర్ణయించినట్లు ఫోర్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ గ్రూప్ ప్రెసిడెంట్ కే హార్ట్ తెలిపారు. ఈ ప్లాంట్ను రీఓపెన్ చేయడానికి ఉద్దేశించిన ఇంటెంట్ లెటర్ను తమిళనాడు ప్రభుత్వానికి అందజేసినట్లు వివరించారు.
అమెరికా పర్యటనలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. మిచిగాన్లో గల ఫోర్డ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. చెన్నైలో ప్లాంట్ను రీఓపెన్ చేయాలని, దీనికి అవసరమైన రాయితీలను ఇస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు. దీనిపై ఫోర్డ్ మోటార్స్ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.












Click it and Unblock the Notifications