జైల్లో శశికళ కర్మకాండ, రూ. 2 కోట్లు లంచం, నివేదిక వచ్చింది, హోం మంత్రి రామలింగా రెడ్డి!
బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణలపై రిటైడ్ ఐఏఎస్ అధికారి ఆధ్వరంలో వేసిన కమిటి విచారణ పూర్తి చేసిందని కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు.
రిటైడర్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని రామలింగా రెడ్డి అన్నారు. రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ ఇచ్చిన నివేదికలోని అన్ని అంశాలు పరిశీలించి, మంత్రి వర్గంతో చర్చించి తరువాత ఓ నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు.
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని, అందుకు ప్రతిఫలంగా ఆమె కుటుంబ సభ్యుల దగ్గర జైళ్ల శాఖ అధికారులు రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారని డీఐజీ రూపా ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి, సీనియర్ పోలీసు అధికారులకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.
శశికళ ఎప్పుడు పడితే అప్పుడు జైలు నుంచి బయటకు వెళ్లి షాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసి విచారణ చేయించింది. వారం క్రితమే ప్రభుత్వానికి రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ కమిటి నివేదిక ఇచ్చిందని, త్వరలోనే ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు.