కన్నుమూసిన ట్రబుల్ షూటర్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు
న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన దేశ రాజధాని కంటోన్మెంటలో గల సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్నారు. అనారోగ్యంతో ఆగష్టు 10న ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు.
Recommended Video
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. అత్యాధునిక వైద్య చికిత్సను అందించినప్పటికీ.. ఫలితం రాలేదు. ఆయన ప్రాణాలను నిలపడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రక్త ప్రసరణలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 10వ తేదీన డాక్టర్లు ఆయనకు సర్జరీ చేశారు. బ్రెయిన్ క్లాట్ ఏర్పడిందని, సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తూ వచ్చామని పేర్కొన్నారు. ఇక కొద్ధిరోజులుగా ఆయన డీప్ కోమాలో ఉన్నారు.ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ప్రాణాలను నిలపలేకపోయామని అన్నారు.

2012 జులై నుంచి 2017 జులై మధ్యకాలంలో ఆయన భారత రాష్ట్రపతిగా పని చేశారు. 1935 డిసెంబర్ 11వ తేదీన ప్రణబ్ ముఖర్జీ అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని మిరటీలో జన్మించారు. యూనివర్శిటీ ఆప్ కలకత్తాలో చదువుకున్నారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో కొనసాగారు ప్రణబ్ ముఖర్జీ. కేంద్రమంత్రివర్గలో పలు శాఖల్లో పనిచేశారు. ఆర్థిక నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ శాఖ మంత్రిగా పనిచేశారు.

రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, వాణిజ్యం, ఆర్థిక శాఖల మంత్రిగా పనిచేశారు. ఆయా శాఖలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏకైక ట్రబుల్ షూటర్గా ప్రణబ్ ముఖర్జీ గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రతీసారీ.. ప్రణబ్ ముఖర్జీ వైపు చూపులు సారించేది. ఆయన సారథ్యంలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత లోపాలను సరిదిద్దుకోగలిగింది. అధికారాన్ని అందుకోగలిగింది.
కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఒకదశలో ప్రధానమంత్రి పదవికి అర్హుడిగా భావించారు. 2014లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఉంటే.. అందరి సమ్మతితో ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించి ఉండేవారనే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తం అయ్యాయి. ప్రధానమంత్రి పదవి రేసు నుంచి తప్పించడానికి ఉద్దేశపూరకంగానే ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిందనే విమర్శలు అప్పట్లో విస్తృతంగా వినిపించాయి. ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల దేశం యావత్తూ దిగ్భ్రాంతికి గురైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతాపాన్ని వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications