Tehelka: ఫైవ్స్టార్ హోటల్ లిఫ్ట్లో తోటి ఉద్యోగినిపై రేప్: మాజీ ఎడిటర్పై కేసులో కోర్టు తీర్పు ఇదీ
పనాజీ: ఎనిమిదేళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అత్యాచార కేసు ఉదంతానికి సంబంధించి.. గోవా సెషన్స్ న్యాయస్థానం తాజాగా తన తీర్పు వెలువడించింది. గోవాలోని ఓ హోటల్ ఎలివేటర్లో తోటి ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడిన కేసు నుంచి తెహెల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్కు విముక్తి కల్పించింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా గుర్తించింది. ఆయనపై నమోదైన కేసును గోవా న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తీర్పు వినిపించింది.
దండకారణ్యంలో కలకలం: 13 మంది మావోయిస్టుల మృతదేహాలు
2013 నాటి అత్యాచారానికి సంబంధించిన కేసు ఇది. గోవాలోని ఓ లగ్జరీ హోటల్లో థింక్ ఫెస్టివల్ అనే కార్యక్రమానికి వెళ్లిన తరుణ్ తేజ్పాల్.. ఎలివేటర్లో తన తోటి ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ అప్పట్లో ఫిర్యాదు నమోదైంది. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా దుమారానికి దారి తీసింది. గోవా బ్యాంబోలిమ్లోని ఫైవ్స్టార్ హోటల్ గ్రాండ్ హయాత్లో థింక్ ఫెస్టివల్ పేరుతో ఈ కార్యక్రమాన్ని తెహెల్కా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వెళ్లిన తనపై తరుణ్ తేజ్పాల్ అత్యాచారానికి పాల్పడ్డారంటూ అదే సంస్థలో పనిచేసిన ఓ జూనియర్ ఉద్యోగిని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆమె ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 341, 342, 354, 354-ఏ, 354-బీ, 376 (2) ఎఫ్, 376 (2) కే వంటి సెక్షన్ల కింద ఆయనపై కేసు పెట్టారు. దీనిపై 2013 నుంచి తరుణ్ తేజ్పాల్పై కేసు నడుస్తోంది. అదే ఏడాది నవంబర్లో తేజ్పాల్ అరెస్టయ్యారు. అనంతరం ఆయనకు బెయిల్ లభించింది. ఈ కేసులో ఆ మహిళా ఉద్యోగినిపై తరుణ్ తేజ్పాల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తున్నట్లు గోవా సెషన్స్ కోర్టు తెలిపింది.
ఈ కేసుపై కిందటి నెలలోనే గోవాలోని మపుసా జిల్లా సెషన్స్ న్యాయస్థానం వాదనలను ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. న్యాయమూర్తి జస్టిస్ క్షమా జోషి.. కొద్దిసేపటి కిందట తన తీర్పు వినిపించారు. తరుణ్ తేజ్పాల్పై నమోదైన కేసులన్నింటినీ కొట్టివేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు నుంచి తనకు విముక్తి లభించటం పట్ల తరుణ్ తేజ్పాల్ హర్షం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల తరువాత తనకు ఊరట లభించినట్లు పేర్కొన్నారు. ఈ ఎనిదేళ్లు తమకు అత్యంత బాధాకరమైన రోజులని ఆయన కుమార్తె వ్యాఖ్యానించారు.