కేంద్ర మాజీమంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
న్యూఢిల్లీ: జనతాదళ్ మాజీ అధినేత, కేంద్ర మాజీమంత్రి శరద్ యాదవ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే గుర్ గావ్ లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. శరద్ యాదవ్ మరణవార్తను ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ ధృవీకరించారు. తండ్రి ఇక లేరు.. అంటూ ట్వీట్ చేశారు.
బిహార్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు శరద్ యాదవ్. బిహార్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)కు అధినేతగా వ్యవహరించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయగలిగారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యల వల్లే జేడీయూ బిహార్ లో శాసించే స్థాయికి ఎదిగింది. పార్టీకి కంచుకోటగా మారిన యాదవ ఓటుబ్యాంకును ఆకర్షితులను చేయగలిగారు.

2003లో జనతాదళ్ ఆవిర్భవించిన తరువాత కొన్ని సంవత్సరాల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగారు. తొమ్మిదిసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. పౌర విమానయానం, ఆహారం-పౌర సరఫరాలు, కార్మిక మంత్రిత్వ శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా స్ఫూర్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టారాయన. సోషలిస్ట్ నాయకుడిగా ఎదిగారు. ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. జబల్పూర్, బదౌన్, మాధేపురా సీట్ల నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.

మధ్యప్రదేశ్ హోషంగాబాద్లో 1947లో జన్మించారు. 1971లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా స్ఫూర్తితో శరద్ యాదవ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో మీసా యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు. 1974లో తొలిసారిగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. జయప్రకాష్ నారాయణ్ అడుగు జాడల్లో నడిచారు. బిహార్ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగారు.












Click it and Unblock the Notifications